కుప్పంపై జగన్ మాస్టర్స్ట్రోక్..!
YS Jagan Bus Yatra: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవంక.. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి మరోవంక ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నాయి.
మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తోన్నారు. రాయలసీమ జిల్లాలను చుట్టేస్తోన్నారు. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఆరంభమైన ఈ బస్సు యాత్ర 21 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.

ఈ బస్సు యాత్రం నేటికి ఏడో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అన్నమయ్య రాయచోటి జిల్లాలో సాగుతోంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాల మీదుగా అన్నమయ్య రాయచోటిలో అడుగు పెట్టారు వైఎస్ జగన్. ఈ సాయంత్రం మదనపల్లిలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ బస్సు యాత్ర సందర్భంగా వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జనసేన సీనియర్ నేత పితాని బాలకృష్ణ వైసీపీ కండువా కప్పుకొన్నారు. అనంతరం కదిరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా ఆ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.

ఇవ్వాళ తెలుగుదేశం పార్టీకే చెందిన మరో సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఎం సుబ్రహ్మణ్యం నాయుడు వైసీపీలో చేరారు. కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్.
గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేశారాయన. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకు కుడిభుజంగా చెబుతుంటారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో నంబర్ 2గా గుర్తింపు పొందారు. ఇక్కడ ఆయనకు మంచి పట్టు ఉంది. భారీ సంఖ్యలో క్యాడర్ కూడా ఉంది.
ఈ ఉదయం అమ్మగారిపల్లె క్యాంప్ వద్ద వైఎస్ జగన్ను కలిశారాయన. సుబ్రహ్మణ్యం నాయుడితో పాటు టీడీపీ సీనియర్ నేతలు కృష్ణమూర్తి, బేతప్ప.. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కుప్పం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్ వారి వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications