ఇక కుదరదు, నిరసన తెలపండి: ఎంపీలతో బాబు, మోడీతో తాడోపేడో.. డెడ్లైన్ ఇదే
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఏపీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం జరగాలన్నారు.
Recommended Video
పార్లమెంటు సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీకి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీల పైనా ఉందని చెప్పారు. మూడున్నరేళ్లలో ఏపీకి చేసింది కొంతేనని, చేయాల్సింది ఎంతో ఉందని చెప్పారు.
ఆ బాధ్యత వారిపై ఉంది
విభజన జరిగిన రోజు పార్లమెంటులో ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఇప్పుడు అవే ఉన్నాయని, కాబట్టి ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల పైన ఉందని చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా అన్ని మార్గాలు అన్వేషించాలని వారికి అధినేత సూచించారు.
చేస్తాం, చూస్తామంటే కుదరదు
విభజన హామీలపై ఇంకా చేస్తాం, చూస్తాం అంటే రాష్ట్ర ప్రజలు ఏమాత్రం నమ్మే స్థితిలో లేరని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి వెళ్లేలా నిరసనలు వ్యక్తం చేయాలన్నారు. చేస్తాం, చూస్తామనే స్థాయి దాటిపోయిందని చెప్పారు. ఇప్పుడు కావాల్సింది హామీలు కాదని, చేతలు అన్నారు. స్పష్టమైన కార్యాచరణ కావాలన్నారు.
పెద్ద ఎత్తున నిరసనలు తెలపండి
మన పార్టీ సభ్యులు అందరూ సభకు హాజరు కావాలని, పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చంద్రబాబు వారికి సూచించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా పార్లమెంటులో నిరసన తెలియజేయాలన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు.
ప్రధానిని కలవనున్న ఎంపీలు
తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ను కలిశారు. వారికి సరైన హామీ రాలేదు. పైగా ప్రధానిని కలవాలని కూడా ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు ప్రధానిని కలవనున్నారు.
తేల్చకుంటామని చెప్పేయండి
కాగా, ఈ బడ్జెట్ సెషన్లోగా ఏపీకి కేంద్రం న్యాయం చేయాలని, లేదంటే తాడోపేడో తేల్చుకుందామని కూడా డెడ్లైన్ విధించినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీని కలిసినప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లోపు నిర్ణయం తీసుకోకుంటే ఏదో ఒకటి తేల్చుకుంటామని చెప్పాలని సూచించారని తెలుస్తోంది.