త్వరలో టీవీ9 న్యూస్ చానెల్ వాటాల విక్రయం
హైదరాబాద్: తెలుగుతో పాటు ఇతర భాషల్లో న్యూస్ చానెల్స్ కలిగిన టీవీ9 ప్రమోటర్ల వాటా విక్రయం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలపై వచ్చే నెల రోజుల్లో ఓ స్పష్టత వస్తుందని టీవీ9 వ్యవస్థాపక ప్రమోటర్లలో ఒకరైన శ్రీనిరాజు చెప్పారు. గురువారంనాడు హైదరాబాదులోని ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన సాక్షి మీడియాతో మాట్లాడారు. ఆయనతో జరిపిన సంభాషణను సాక్షి మీడియా ప్రచురించింది.
టీవీ9లో తమ వాటాను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నాయని అన్నారు. పలు ప్రాంతీయభాషల్లో వార్తలందిస్తున్న టీవీ9 న్యూస్ చానల్స్ అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ(ఏబీసీ)లో శ్రీనిరాజుకు 60 శాతం వాటా ఉంది. తమకు సంబంధిన వాటాల విక్రయ వ్యవహారాలు చూసేందుకు రెండేళ్ల క్రితమే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని నియమించామని ఆయన చెప్పారు.
అయితే, ఆర్థిక మందగమనం వల్ల వాటాల విక్రయాన్ని పూర్తి చేయలేకపోయామన్నారు. వాటాలు కొనడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల పేర్లు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఏబీసీ కంపెనీ విలువ మదింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, దీనిపై స్పష్టత వచ్చిన తరువాత విక్రయం పూర్తయ్యే అవకాశం ఉందని రాజు వివరించారు.
టీవీ9 చానల్ను తెలంగాణ రాష్ట్రంలో ప్రసారం కాకుండా ఎంఎస్వోలు అడ్డుకోవడంతో టీవీ9 క్యాపిటల్పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మార్కెట్ అంచనా ప్రకారం ఏడు ప్రాంతీయ చానల్స్ను కలిగి ఉన్న టీవీ9 విలువ 400 కోట్ల రూపాయలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం వాటాల విక్రయం మాత్రమేనని, ఒక ఇన్వెస్టర్ వైదొలగి అతని స్థానంలో మరో ఇన్వెస్టర్ రావడం తప్ప టీవీ9 ఉద్యోగుల్లో, యాజమాన్యంలో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
కాగా, టీవీ9 15శాతం వాటాను ఇదివరకే అమ్మేసింది. ఐల్యాబ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరుతో ఏబీసీ లిమిటెడ్లో 100 శాతం వాటాలు కలిగిన శ్రీనిరాజు చానల్ ప్రారంభమైన తర్వాత సీఈవోతో సహా ఇతర సహోద్యోగులకు 20 శాతం ప్రమోటర్ల వాటాను కేటాయించగా, మరో 20 శాతం వాటాను కొద్ది సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ అనే వీసీ ఫండ్కి రూ. 51 కోట్లకు విక్రయించారు. మిగిలిన 60 శాతం వాటాను అమ్మకానికి పెడుతున్నట్టు శ్రీనిరాజు చెప్పడం గమనార్హం.