విషాదం :ఆప్తులను , పెద్దదిక్కులను కోల్పోయిన కుటుంబాలు, ప్రమాదం నుండి బతికారిలా..
విజయనగరం జిల్లాలో చోటుచేసుకొన్న రైలు ప్రమాదంలో అనేక మంది ఆప్తులను కోల్పోయారు. తమ కళ్ళముందే ఆప్తులను కోల్పోయినవారున్నారు. మరికొందరు ఈ ప్రమాదం నుండి తప్పించుకొన్నారు
విజయనగరం:విజయనగరం జిల్లాలో చోటుచేసుకొన్న రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయినవారంతా గుండెలవిసేలా రోధిస్తున్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయినవారు కొందరైతే, మరికొందరు తమ పిల్లలను కోల్పోయారు.రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎటుచూసినా హృదయవిదాకర ఘటనలే కన్పిస్తున్నాయి.
విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని కూనేరు వద్ద శనివారం నాడు జరిగిన రైలు ప్రమాదంలో 39 మంది చనిపోయారు. మరో యాభై మందికి పైగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం విద్రోహుల కారణంగా చోటుచేసుకొందా, లేక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చోటుచేసుకొందా అనే దిశగా అధికారులు దర్యాప్తును చేపట్టారు.
ప్రమాదం జరిగిన చోట రైల్వే ట్రాక్ రెండు చోట్ల తొలగించినట్టు ఉండడంతో పాటు అనుమానాస్పద వస్తువును కూడ దొరికిందనే వార్తలు కూడ వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆప్తులను కోల్పోయిన వారెందరో
రైలు ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 39 మంది మరణించగా, మరో యాబై మంది క్షతగాత్రులయ్యారు. విజయనగరం జిల్లాలోని రంగాల వీధికి చెందిన కె.రేవతి , కె.రవి, సంక్రాంతి పండుగ కోసం తల్లి శారదతో కలిసి భవానీపట్నం వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలో హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. కూనేరు వద్ద ఈ రైలు ప్రమాదంలో రేవతి అక్కడికక్కడే మరణించింది.రవి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చకిత్స పొందుతూ మృతి చెందాడు. శారద చిన్నపాటి గాయాలతో బయటపడింది.శారద భర్త శ్రీనివాస్ ఏడాది క్రితమే మరణించాడు. ఈ ప్రమాదంలో పిల్లలిద్దరూ విగత జీవులయ్యారు.
పెద్దను కోల్పోయిన కుటుంబం
పది నిమిషాల్లో వస్తానని చెప్పి కుటుంబ పెద్ద తిరిగి రాని లోకాలను వెళ్ళడంతో పార్వతీపురానికి చెందిన ఓ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పార్వతీపురానికి చెందిన విజయరామరాజు కాలనీకి చెందిన మండల బలరామనాయుడు ముప్పై ఏళ్ళుగా చిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.పార్వతీపురంలో కూరగాయలు, కిరాణసామానును కొనుగోలుచేసి ఒడిశాలోని రాయ్ ఘడ్ లో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.శనివారం నాడు విశాఖ కోరాపూట్ ప్యాసింజర్ లో వెళ్లి తిరుగు ప్రయాణంలో హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఇంతలో భార్య శకుంతల ఫోన్ చేసింది. అయితే పదినిమిషాల్లో వస్తానని చెప్పాడు. కాని, ఆ పది నిమిషాల్లోనే ఆయన ఈ ప్రమాదంలో చనిపోయాడు.
కళ్ళముందే తల్లిదండ్రులను కోల్పోయారు
ఒడిశాలోని రాయ్ ఘడ్ కు చెందినన తేజస్విని పండింట్ కు ఈ ఏడాది మార్చి 5వ, తేదిన వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి సంబంధం కుదిరిందని ఒఢిశాలోని పూరీ జగన్నాథుడిని దర్శించుకొనేందుకుగాను హీరాఖండ్ రైలు ఎక్కారు. తేజస్వినితో పాటు ఆమె తల్లి యశోదా పండిట్, తండ్రి భాస్కర పండిట్ లు రైలులో బయలుదేరారు.రైలు బయలుదేరిన పదినిమిషాలకే తల్లిదండ్రులిద్దరూ ఈ ప్రమాదంలో చనిపోగా, తేజస్విని పండింట్ మాత్రం ప్రాణాలను దక్కించుకొంది.
అత్త మరణించింది.,కోడలు బతికింది
హీరాఖండ్ రైలు ప్రమాదంలో విజయనగరం జిల్లా సాలూరులోని రెల్లి వీధికి చెందిన అమ్మనమ్మ మరణించింది.ఆమె కోడలు అరుణతో కలిసి రైలులో పూలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. భర్తకు క్షయ వ్యాధి ఉంది. దీంతో ఆయన ఏ పనిచేసే పరిస్థితి లేదు. మరో వైపు కొడుకు కూడ అంతంత మాత్రంగానే పనిచేస్తాడు. దీంతో ఇంటి బరువు బాద్యతలన్నీ అత్త, కోడలుపైనే పడ్డాయి.రైలులో పూలు విక్రయిస్తూ వారు జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో అమ్మణమ్మ అక్కడికక్కడే మరణించింది. కోడలు అరుణ ప్రాణాలతో బయటపడింది.
ప్రమాదం నుండి బయటపడ్డారిలా
ఒడిశాలోని రాయ్ ఘడ్ కు చెందిన సేనాపతి శేఖర్ తన కుటుంబసభ్యులను హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ ను ఎక్కించాడు.అయితే రాత్రి పది గంటలకు ఆయన తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించాడు.అయితే రాత్రి పదకొండున్నర గంటలకు రైలు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో తన భార్యసంతోషి , ఆమె చెల్లెలు అత్త మామ, చిన్నత్త, చిన్నమామాలు రైలులోప్రయాణించారు.శేఖర్ కు రాత్రి పదకొండున్నర గంటలకు భార్యనుండి ఫోన్ వచ్చింది. తాము ఎక్కిన రైలు ప్రమాదానికి గురైందని ఆమె చెప్పింది.అయితే ఈ ప్రమాదంలో శేఖర్ కుటుంబసభ్యులంతా క్షేమంగా బయటపడ్డారు.తమ వారికి వేర్వేరు బోగిల్లో రిజర్వేషన్ దొరికింది.అయితే ఎస్ 2 బోగీలో అందరూ ఎక్కారు.అయితే ఈప్రమాదంలో ఎస్ 7బోగి పూర్తిగా, ఎస్ 8 పాక్షికంగా ధ్వంసమైంది.వీరంతా ఎస్ 2 లో ఎక్కడంతో ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు.