బాబుకు కేసీఆర్ 'గ్రేటర్' షాక్: వీరిలో కారెక్కేది ఎవరో?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారా అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన కీలక ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు దసరా తర్వాత కారు ఎక్కనున్నారని సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్తో పలుమార్లు భేటీ అయిన ఆ ఎమ్మెల్యేలు ముహూర్తం దసరా తర్వాత ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ నెల 24వ తేదీ వరకు మంచి రోజులు లేవు. దీంతో ఆ తర్వాత ఆయనను కలవాలనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే తెరాసలో చేరిన తుమ్మల నాగేశ్వర రావు సీనియర్ టీటీడీపీ నేతలను తీసుకు వచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు.

మంత్రులు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావులు ఇప్పటికే.. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రకాశ్ గౌడ్, వివేకానంద్, చల్లా ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. వీరిలో కొందరు తెరాసలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారంటున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో బలోపేతం కావడమే లక్ష్యంగా తెరాస పని చేస్తోంది. దసరా తర్వాత తెరాస పార్టీ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ప్లీనరీకి ముందే టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో వారిని ప్లీనరిలో వేదిక పైకి తీసుకు వచ్చే అవకాశముందని అంటున్నారు. కాగా, పార్టీలోకి వచ్చే వారికి కీలక పదవులు ఇవ్వనున్నారని ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ టీడీపీ నేతల చేరిక తర్వాతనే ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications