చిరంజీవీ! పవన్ను చూసి నేర్చుకో!: తొక్కిసలాటపై సోమిరెడ్డి, 35కి చేరిన మృతులు
విజయవాడ: రాజమండ్రి పుష్కర ఘాట్ తొక్కిసలాటపై ప్రతిపక్షాలది అనసవర రాద్దాంతమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని.. భక్తులకు బాసటగా నిలవాలని అన్నారు.
తొక్కిసలాట ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరైన రీతిలో స్పందించారని అన్నారు. పుష్కరఘాట్ వద్ద తన అభిమానులు, కార్యకర్తలను భక్తులకు సహకారం అందించాలని పిలుపునివ్వడం అభినందనీయమని సోమిరెడ్డి అన్నారు.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత చిరంజీవి.. పవన్ కళ్యాణ్ను చూసి నేర్చుకోవాలని సూచించారు.
35కి చేరిన మృతుల సంఖ్య
రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తొక్కిసలాటలో గాయపడిన మరో ఇద్దరు మృతి చెందడంతో.. మృతుల సంఖ్య 35కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో భక్తుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాజమండ్రికి చేరుకున్న చిరంజీవి, రఘువీరా
రాజమండ్రి పుష్కర ఘాట్లను కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, సి రామచంద్రయ్య, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్లు సందర్శించారు. తొక్కలాటలో గాయపడిన పలువురు బాధితులను వారు పరామర్శించారు.