తల్లిని వేధిస్తున్నాడని తండ్రి హత్య: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో విషాదం, పరుగులో గెలిచి...
హైదరాబాద్: అనంతపురం జిల్లా తలుపుల బీసీ కాలనీకి చెందిన రామచంద్ర (45)ను కన్నకొడుకు దారుణంగా హత మార్చాడు. మంగళవారం సాయంత్రం కొడుకు అనిల్కుమార్ రోకలిబండతో తండ్రి రామచంద్రను మోదడంతో ఆయన అక్కడిక్క డే మృతి చెందినట్లు ఎస్ఐ గోపాలుడు తెలిపారు.
రామచంద్ర ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య రమణమ్మతో గొడవ పడి వేధిస్తుండేవాడన్నారు. మంగళవారం కూడా మద్యం సేవించి తన తల్లిని కొట్టడాన్ని చూసిన కొడుకు అనిల్కుమార్ ఇంటిలో ఉన్న రోకలిబండ తీసుకుని తండ్రి తలపై కొట్టాడు. దీంతో రామచంద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. రామచంద్రకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురుకు పెళ్లయింది.
ఆస్తి కోసం కన్నతండ్రిపై హత్యాయత్నం
ఇదిలావుంటే, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని జుప్పిగలో తండ్రిని సొంత కొడుకే కడతేర్చడానికి ప్రయత్నించాడు. ఆస్తి పంపకాల్లో వచ్చిన చిన్న తగాదా కారణమని పోలీసులు చెపుతున్నారు. తండ్రి పరిస్థితి విషమించడంతో హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో మూడు హత్యలు
నెల్లూరు జిల్లాలో మూడు హత్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి ముగ్గురిని దారుణంగా హత్య చేసిన దుండగులు వారిని గుర్తుపట్టకుండా తగులబెట్టేశారు. బుధవారం ఉదయం నాయుడుపేటలోని శివారులోని కాళహస్తిరోడ్డులో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసి తగుబెట్టారు. అతడి వయసు దాదాపు 30 ఏళ్ల ఉంటుందని గుర్తించారు.
నెల్లూరు జిల్లాలోని గూడూరులో మరో హత్య వెలుగులోకి వచ్చింది. శివారులోని అటవీ ప్రాంతంలో వినాయకుడి ఆలయం వద్ద మరో శవాన్ని గుర్తించారు. అదే విధంగా కొడవలూరు మండలం రేగడిచిలక ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది.
ఆటోతో సహా మృతదేహాన్ని దుండగులు తగులబెట్టారు. ఈ మూడు ఘటనలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తమిళనాడుకు చెందిన కిరాయి హంతుకులు హత్య చేసి ఉంటారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు హత్యలపై అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హత్యలకు గురైన వారు ఎవరనే దానిపై పూర్తి స్థాయిలో విచారణను మొదలు పెట్టారు.
దోపిడీ ముఠా పట్టివేత
గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మాచర్ల దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కోట్లు విలువచేసే డ్రగ్స్, తుపాకులను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. నిందితులు గతంలో కిడ్నాప్లు, హత్యలు, వరుస దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని, అరెస్ట్ చేసిన నిందితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో విషాదం
విశాఖ ఆర్మీ రిక్రూట్మెంటులో విషాదం చోటు చేసుకుంది. పరుగు సందర్భంగా కుప్పకూలి, ఆ తర్వాత మృతి చెందాడు. రిక్రూట్మెంట్ ర్యాలీకి వచ్చి, పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ పోటీ ముగిసిన తర్వాత సొమ్మసిల్లి పడిపోయాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణాలు కోల్పోయాడు.
శ్రీకాకుళం జిల్లాకు వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగు పందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయ్యాక మొదటి స్థానంలో నిలిచాడు. అయితే, ఆ తర్వాత అతను సొమ్మసిల్లడంతో అదికారులు అతనిని ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకుండాపోయింది.












Click it and Unblock the Notifications