ఎన్నికల వేళ: 16న హైదరాబాద్ సభలో సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్టానం తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు పొందే ఆలోచనలో ఉంది. ఇందుకుగాను ప్రచారాన్ని కూడా పెద్ద యెత్తున చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ హైదరాబాదు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ రోజు జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రసంగిస్తారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
తెలంగాణలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారైందని, అయితే స్థానిక ఎన్నికల మూలంగా ఈ నెల 4, 5 తేదీల్లో ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అయితే తెలుగుదేశం, బిజెపి మధ్య పొత్తు ఖరారు కావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో బేరసారాలు చేసేందుకే కాంగ్రెస్ జాబితాను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది.
సోమవారం మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రులు వయలార్ రవి, జైరాం రమేశ్తో కూడిన స్క్రీనింగ్ కమిటీ జాబితాపై కసరత్తు జరిపింది. పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సమావేశానికి హజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్లో చేరిన పార్లమెంటు సభ్యుడు వివేక్, ఆయన సోదరుడు వినోద్, కేంద్ర మంత్రి బలరాంనాయక్లను కూడా కమిటీ పిలిపించి కొద్ది సేపు మాట్లాడింది.
దానికి ముందు, జాబితాపై పొన్నాల, ఉత్తమ్, దామోదర్ తాజ్మాన్సింగ్ హోటల్లో కొంత కసరత్తు జరిపారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేశారు. ఎంపీల సీట్లు దాదాపు ఖరారయ్యారని, అదిలాబాద్, చేవెళ్ల సీట్లను మాత్రం పెండింగ్లో ఉంచారని తెలుస్తోంది. చేవెళ్లనుంచి సబితా ఇంద్రారెడ్డి లేదా ఆమె కుమారుడు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో దాదాపు 70 అసెం బ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారని తెలుస్తోంది. కాగా స్క్రీనింగ్ కమిటీ ఆమోదించిన పేర్లన్నీ ఆమోదించామని దిగ్విజయ్ చెప్పారు. 6, 7 తేదీల్లో సీమాంధ్ర అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తామన్నారు.