వైసిపి నేత నారాయణ రెడ్డి హత్య: లోకల్ పోలీసులకు ఎస్పీ హెచ్చరిక
నారాయణ రెడ్డికి ప్రాణహానీ ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రక్షణ కల్పించలేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
కర్నూలు: నారాయణ రెడ్డికి ప్రాణహానీ ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రక్షణ కల్పించలేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
తెలిస్తే నారాయణరెడ్డిని రక్షించేవాడ్ని: కేఈ, 'చంద్రబాబు రిజైన్ చేయాలి'
ఇటీవల కర్నూలులో వైసిపి పత్తికొండ ఇంచార్జ్ నారాయణ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్పీ రవికృష్ణ మండలంలోని చెరుకులపాడు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించారు.
స్థానిక పోలీసులపై చర్యలు
జిల్లాలో ఏప్రాంతంలోనైన ఫ్యాక్షన్ నేరాలు జరిగితే స్థానిక పోలీసు అధికారులపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. చెరుకులపల్లి గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్యల అనంతరం గ్రామంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
సాంబశివుడు కుటుంబంతో..
సాంబశివుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయానని తల్లి రాములమ్మ ఎస్పీకి తెలిపారు. ఎలాంటి ఘర్షణలకు సైతం వెళ్లేవాడు కాదని అయినా తన కుమారుడిని హత్యచేసి తమ కుటుంబ సభ్యులను దిక్కులేని వారిని చేశారన్నారు.
నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో..
చెరుకులపాడు నారాయణరెడ్డి ఇంటికి వెళ్లి భార్య శ్రీదేవి, సోదరుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నారాయణ రెడ్డికి ప్రాణహాని ఉందని పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని రక్షణ కల్పించలేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారన్నారు.
ఆందోళన అవసరం లేదని భరోసా
స్థానిక ఎస్సైకి తెలిపినా పట్టించుకునేవాడుకాదని, ఆయన నిర్లక్ష్యం వల్లే ఈపరిస్థితి ఎదురయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఎస్పీ వారికి తెలిపారు.
నిష్పక్షపాతంగా దర్యాఫ్తు
ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిఘా ఉంచామని, అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరుల కదలికలను పరిశీలిస్తున్నామన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్య కేసులో ప్రత్యేక అధికారిగా డోన్ డీఎస్పీ బాబఫకృద్దిన్ను నియమించామన్నారు. ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అలసత్వం వహిస్తే...
స్థానిక పోలీసులు విధుల్లో అలసత్వం వహించినట్లు తెలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. దోషులకు శిక్షపడేలా చేస్తామన్నారు.