ఎవరెవరు ఎంతెంత?: రాజధానిలో భూములు కొన్న టీడీపీ నేతలు వీరే
అమరావతి: మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేల వలసలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు తాజాగా రాజధాని భూబాగోతం చుట్టూ తిరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, నేతలు పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారంటూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు చెందిన 'సాక్షి' మీడియా వరుస కథనాలు ప్రచురిస్తోంది.
ఈ కథనాలను కొందరు టీడీపీ నేతలు ఖండిస్తే, మరికొందరు తాము రాజధానిలో భూములను కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని అన్నారు. రైతులను మోసగించి కారు చౌకగా కొట్టేసిన భూములు ఇప్పుడు టీడీపీ నేతలకు కోట్లు కురిపిస్తున్నాయి.
రాజధాని భూబాగోతంలో ముఖ్యమంత్రి తనయుడు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల బినామీలే ఉన్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీని ఇరకాటంలో నెట్టేసింది. సాక్షి కథనాలపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు.
సాక్షి కథనం ప్రకారం రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు కొన్న భూముల వివరాలివి:
మంత్రి నారాయణ:
రాజధాని భూసమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ భూదందాలోనూ ముందున్నారు. రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని కాదని రాజధాని ప్రాంతంలో భూసమీకరణ బాధ్యతలను మంత్రి నారాయణకే అప్పగించారు. ఎకరం కనిష్టంగా రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.15 లక్షల చొప్పున 3,129 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేశారు.
భూముల కొనుగోలులో నారాయణ తన తెలివిని జాగ్రత్తగా ఉపయోగించారు. భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్సు కింద రూ. 2 లక్షలు ముట్టజెప్పి, తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారని సాక్షి పేర్కొంది. మంత్రి నారాయణ బినామీలుగా ఆకుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల తదితరులు ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్:
కోర్ కేపిటల్ లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అయితే రాజధానిలో భూములు కొన్న విషయంపై పయ్యావుల గురువారం మీడియాలో స్పందించారు. నేను మగాడిలో రాజధాని ప్రాంతంలో భూములు కొన్నానని చెప్పారు. జగన్లా బినామీ పేర్లతో కొనలేదన్నారు. 2009లో, 2014లో కొన్న కార్లు కూడా తనవి అని చెప్పుకోలేని బతుకు జగన్ది అన్నారు. నీలా బినామీ పేర్లతో కొనలేదని, సొంతగా మగాడిలో కొన్నానని చెప్పారు.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్:
రాజధాని ప్రకటనతో కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ్ల వ్యూహాత్మకంగా పావులు కదిపారని పేర్కొంది.
రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఒక్క పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్:
కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లను వేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తూ వస్తున్నారు. అదే సంస్థ యర్రబాలెంలో అమరావతి టౌన్షిప్ను ఆనుకుని సర్వే నంబర్ 485 నుంచి 500 వరకు 42 ఎకరాలు కొనుగోలు చేసింది.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధినేతపై ఒత్తిడి తెచ్చి రూ.210 కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని భూసమీకరణ నుంచి తప్పించినట్లు సాక్షి ఆరోపణలు చేసింది. అభినందన రియల్ ఎస్టేట్ వెంచర్కు చెందిన 42 ఎకరాల భూములను భూ సమీకరణకు ఇవ్వకపోగా.. డ్రాఫ్ట్ మాస్టర్ప్లాన్లో సైతం వదిలేసింది.
స్పీకర కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణ:
వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. అధికార బలాన్ని ఉపయోగించి వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నెంబర్లు 167-1ఏ, 167-1సీ, 168-1, 168-3లో 17.3 ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఇది పసిగట్టిన కోడెల శివరామకృష్ణ ఒకరిని తన వద్దకు పిలిపించుకున్నారు.
తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న శశి ఇన్ఫ్రా పేరుతో ఎకరం రూ. 8 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. వాస్తవంగా ఆ ప్రాంతం ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోండటం గమనార్హం.