175 మంది ఖైదీలకు విముక్తి - ఏపీ ప్రభుత్వ నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 175 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఖైదీల జాబితాను జైళ్ల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిని ఆమోదించిన ప్రభుత్వం వారిని ఖైదు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తూ హోం శాఖ కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అయితే విడుదల అవుతున్న ఖైదీలు ఒక్కొక్కరు రూ.50 వేల వ్యక్తిగత పూచికత్తు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో సత్ప్ర వర్తన కలిగిన 66 మంది ఖైదీ లను నేడు విడుదల చేయనున్నారు. దీంతో పాటుగా ఇతర శిక్షలు అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీ లను సత్ప్రవర్తన కలిగిన వారిగా గుర్తించటంతో ప్రభుత్వానికి అందిన సిఫార్సుల మేరకు వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక, మహిళా జైలు లో శిక్ష అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన తో ఉన్న 11 మంది మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం నాడు వీరంతా జైలు నుంచి విడుదల కానున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. జీవిత ఖైదు శిక్షా కాలం ముగిసేంత వరకూ విడుదలైన వ్యక్తులు 3 మాసాలకు ఓసారి సంబధిత పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. విడుదలైన ఖైదీల ఏదైనా నేరపూరిత చర్యలకు పాల్పడితే తక్షణమే రీ అరెస్టుకు బాధ్యులు అవుతారని పేర్కొంది. ఇదే సమయంలో అజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సత్ప్రర్తన కలిగిన మరో 20 మంది ఖైదీల విడుదలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications