జగన్ దురంహకారి: శ్రవణ్, కెసిఆర్ వత్తాసుపై ఫైర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి కెసిఆర్ వత్తాసు పలకడంపై ఏంటని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారకుడయ్యారని ఆరోపించారు. 2009లోనే జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నాడని అన్నారు. కెసిఆర్ దోపిడీ దొంగలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. గత నాలుగైదు ఏళ్లుగా భూ దందాలు చేశాడని వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన కెసిఆర్, ఇప్పుడు ఆయనే సీమాంధ్ర ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

తమది తెలంగాణ పార్టీ అని చెప్పుకునే కెసిఆర్, పక్క రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో పోటీ జగన్ పార్టీ పోటీ చేసినప్పటికీ ఆ పార్టీపై ఏనాడు కెసిఆర్ విమర్శించలేదని శ్రవణ్ అన్నారు. అప్పుడే తమకు అనుమానం వచ్చిందని, ఆ లోపాయికారి చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడి జనగ్కు దోచిపెట్టారన్న కెసిఆర్, ఇప్పుడే ఆయనే సీమాంధ్ర సిఎం అవుతారని చెప్పడం చీకటి ఒప్పందంలో భాగమేనా అని శ్రవణ్ ప్రశ్నించారు. కెసిఆర్ మాటలు రోజుకో మాట, పూటకో సామెతలా ఉన్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడిన కెసిఆర్, ఎన్నికల సమయంలో మతతత్వ పార్టీలతో వెళ్లనని చెప్పారని అన్నారు. ఎన్నికలయ్యాక ఇప్పుడు యూపిఏకు మద్దతిస్తామని కెసిఆర్ అంటున్నారు.. మరి ఫలితాల తర్వాత ఏమంటారోనని వ్యంగ్యంగా స్పందించారు.












Click it and Unblock the Notifications