హిందూపురం నుంచి గెలిచారుగా..: బాలకృష్ణకు మొహం మీదే చెప్పిన శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు శాసన సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో రాయలసీమ వారిని విలన్లుగా చూపించడాన్ని ఆయన సభలో ప్రశ్నించారు. దానిని మానుకోవాలన్నారు.
భవిష్యత్లో సినిమాల్లో రాయలసీమ ప్రజలను గూండాలుగా చిత్రీకరిస్తే ప్రభుత్వం నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను కించపరిచే సినిమాలు ఇకపై రాకూడదని అన్నారు.
మాట మాట్లాడితే రాయలసీమ గూండాలు అంటూ సినిమాల్లో చిత్రీకరించడం దారుణమన్నారు. నలుగురికి అన్నం పెట్టే గుణం సీమ ప్రజలదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. తమ దగ్గర లేకపోయిన అప్పు తెచ్చి పెట్టేటువంటి గుణం సీమ ప్రజలదని ఆయన తెలిపారు. ప్రతీ విషయంలో సీమ ప్రజలను కించపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ఆయన హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణకు నేరుగా సూచన చేశారని తెలిస్తోంది. సభలో ఆయన మాట్లాడిన అనంతరం వెలుపలికి వచ్చారు. ఆ సమయంలో ఆయనకు బాలకృష్ణ ఎదురు పడ్డారు.
ఈ సందర్భంగా అదే విషయాన్ని ఆయనకు చెప్పారు. సినిమాల్లో రాయలసీమ సంస్కృతిని, యాసను కించపరచడం మానుకోవాలని కోరారు. రాయలసీమ నుంచే ఎన్నికైన ఎమ్మెల్యేగా ఇందుకు చొరవ తీసుకోవాలన్నారు.
సీమ ప్రాంతాన్ని కించపరచవద్దన్నారు. విలన్లకు మాత్రమే సీమ యాస వాడి, హీరోలకు మరో యాస వాడుతున్నారన్నారు. దీనికి బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు. సీమ సంస్కృతిని కించపర్చకుండా చూస్తామన్నారు.