బొత్సకు ఢిల్లీ పెద్దల ఫోన్, ఆరా: గొడవ పడాలనే... బిజెపి
హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్లు ఫోన్ చేసి విజయనగరంలోని ఆయన ఆస్తుల దాడి అంశం, రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని ఆయనకు వారు హామీ ఇచ్చారు. అలాగే సీమాంధ్రలోని పరిస్థితులపై ఆయనను అడిగి తెలుసుకున్నారు.
విజయనగరం జిల్లాలో మూడు రోజులుగా బొత్సకు చెందిన ఆస్తుల పైన సమైక్యవాదులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు బొత్సకు ఫోన్ చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు బొత్స ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్టానం పెద్దలతో రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు.\
మరోవైపు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళి, పసుపులేటి బాలరాజు, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు కలిశారు. దాడుల అంశం వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాడుల వెనుక రాజకీయ కోణం ఉందా? అనే విషయమై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే కొంతకాలం ఆగితో అంతా తెలుస్తుందని మరికొంతమంది అభిప్రాయపడ్డట్లుగా సమాచారం.
గొడవ పడాలన్నదే కాంగ్రెసు ఉద్దేశ్యం: బిజెపి
సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు గొడవపడాలన్నదే కాంగ్రెసు పార్టీ ఉద్దేశ్యమని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ వేరుగా అన్నారు. తాము మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఇంత గొడవ జరగలేదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలతో మాట్లాడి రాష్ట్రాలను విభజించామన్నారు. ఈ ప్రభుత్వం అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ నేతలు రాజీనామాల పేరుతో డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.