కేంద్రంపై నా పోరాటానికి మద్దతుగా నిలవండి:రాష్ట్ర ప్రజలకు సిఎం చంద్రబాబు పిలుపు
పశ్చిమగోదావరి జిల్లా: ఏపీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తాను గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకొంటామని మోడీ అప్పట్లో ఏపీలో జరిగిన పలు ఎన్నికల సభల్లో ఇచ్చిన హమీలను గుర్తుచేశారు. అయితే కేంద్రం ఎపి ప్రయోజనాలు పట్టించుకోకపోతుండటంతో వారితో తెగతెంపులు చేసుకోవడమే కాకుండా అవిశ్వాసం కూడా పెట్టినట్లు చెప్పారు.
పశ్చిమ గోదావరిలో...సిఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లాకు చేరుకున్న సీఎం అక్కడి నుంచి పసివేదల గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపై గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. గత ప్రభుత్వాల హయంలో 14 లక్షల ఇళ్లను నిర్మించామని లెక్కలు చూపారని ఆయన గుర్తు చేశారు. కానీ, లబ్దిదారులకు ఇళ్లు నిర్మించలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లను నిర్మించనుందన్నారు. వచ్చే ఏడాది జనవరి , ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో సుమారు 19 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు.
భావితరాల భవిష్యత్తు కోసం...పోరాటం
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎన్నడూ రాజీపడబోమని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే ప్రతిపక్షనేత జగన్ అతనిపై కేసులను మాఫీ చేసుకునేందుకే ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏతో రాజీపడ్డారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. అందుకే కేంద్రంపై పోరాటానికి వైసీపీ సిద్దంగా లేదన్నారు. ప్రతి శుక్రవారం నాడు కోర్టులకు హజరై జగన్ తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసులకు భయపడే జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కేంద్రంపై తాను చేసే పోరాటానికి మద్దతుగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. భావితరాల భవిష్యత్తు కోసం తాను పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.
ఎపి ని దెబ్బతీయడం...ఎవరి వల్లా కాదు...
ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకోవడం ఎవరి వల్ల కాదని సిఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి కేంద్రంపై అవిశ్వాసం పెట్టి అందుకు అన్ని పార్టీలను ఒప్పించినట్లు చంద్రబాబు తెలిపారు. 126 మంది ఎంపీలు ఏపీ ప్రయోజనాల కోసం మద్దతుగా నిలిచినట్టు చంద్రబాబు వివరించారు. ఏపీకి అన్యాయం జరిగిన విషయమై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి కేంద్రమంత్రులు కూడ ఇటీవల రాజ్యసభలో మాట్లాడారని ఆయన చెప్పారు. కానీ, రాజ్యసభలో బీజేపీ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. రాజ్యసభలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు అడ్డగోలుగా వాదించారని చంద్రబాబునాయుడు అన్నారు.
ఎన్టీఆర్ ను తప్పిస్తే...పోరాటం
గతంలో కూడ ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయనను పదవి నుండి తప్పించారని సిఎం చంద్రబాబు గుర్తుచేశారు. అప్పుడు టిడిపి ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేవరకు పోరాటం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదీ టీడీపీ చరిత్ర అన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం సహకరించి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి రూ.57వేల కోట్లు ఖర్చు అవుతోందన్నారు. గత ప్రభుత్వం , ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడ సహకరిస్తామని చెప్పారు. కానీ, నిధులను ఇవ్వడంలో కూడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు ఆరోపించారు.
ప్రభుత్వం...అంటే చూపిస్తాం
వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. దేశంలో వ్యవసాయంలో 11 శాతం అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఏపీ రాష్ట్రమని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. పాడిపరిశ్రమ, ఉద్యానవనశాఖ, చేపల పెంపకంపై కేంద్రీకరించిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.అక్వా రంగానికి యూనిట్ ధరను రూ.1.50లకు తగ్గించినట్టు చెప్పారు. ఏపీ రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ చేశామని...రైతాంగం కోసం రూ.24 వేల కోట్లను ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. రుణమాఫీ, పెన్షన్ ఇచ్చినందుకు కేంద్రం నిదులు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బెల్ట్షాపులు పెట్టినాబెల్టు తీస్తామని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ప్రభుత్వమంటే ఏమిటో చూపిస్తామని చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.