మేఘా కృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు గ్రూపులుగా విడిపోయిన ఆస్పత్రి డైరెక్టర్లు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు హోరాహోరీగా తలపడుతున్నారు. ఆస్పత్రి డైరెక్టర్లలోని ఒక వర్గం మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి రూ.630 కోట్లకు ఆసుపత్రిని కట్టబెట్టే ప్రయత్నం చేయబోయింది. దీన్ని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.
ఉన్న డైరెక్టర్లలో ఎక్కువమంది ఆసుపత్రి అమ్మకాన్ని వ్యతిరేకించడంతో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అబ్జర్వర్ ను నియమించారు. అబ్జర్వర్ వల్ల ప్రయోజనం ఉండదని భావించిన మేఘా కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా సుప్రీంకోర్టు అబ్జర్వర్ ను కొనసాగిస్తూ తీర్పు ఇచ్చింది. రూ.630 కోట్లకు ఆస్పత్రిని కొనుగోలుచేస్తే పేదలకు తక్కువ ధరకు వైద్యం ఎలా అందిస్తారని కొందరు డైరెక్టర్లు 'మేఘా'ను ప్రశ్నించారు. మరికొందరు మాత్రం అమ్మకానికి మొగ్గు చూపడంతో ఆస్పత్రి యాజమాన్యం గందరగోళంలో పడింది.

ఇటీవలే ఈడీ కూడా ఎన్నారై ఆసుపత్రిలోను, పలువురు డైరెక్టర్ల ఇళ్లల్లోను సోదాలు నిర్వహించింది. అక్రమ నగదు చెలామణిని గుర్తించామని, దీనివల్లే దాడులు చేసి. కొన్ని ఆస్తులు జప్తుచేశామని ఈడీ పేర్కొంది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందట పేదలకు అధునాతన వైద్యాన్ని అతి తక్కువ ధరలకే అందించాలనే సదుద్దేశంతోపాటు, పేదలకు వైద్యవిద్యను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఆస్పత్రిని, కళాశాలను ప్రారంభించారు. యాజమాన్యం మధ్య గొడవలు తలెత్తడంతో దాన్ని కైవసం చేసుకోవడానికి మేఘా కృష్ణారెడ్డితోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయారు.












Click it and Unblock the Notifications