ఏపీ ప్రభుత్వానికి "భోళా శంకర్" తాజా రిక్వెస్ట్ - బిగ్ ట్విస్ట్, ఉత్కంఠ..!!
మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వేడి పెంచుతున్నాయి. పవన్ కల్యాణ్ వర్సస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్లుగా సాగుతున్న పొలిటికల్ వార్, ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ తో కొత్త టర్న్ తీసుకుంది. ఇదే సమయంలో చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సమయంలో భోళా శంకర్ మేకర్స్ నుంచి ఏపీ ప్రభుత్వానికి తాజా రిక్వెస్ట్ వచ్చింది. దీని పైన సీఎం జగన్ తీసుకొనే నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీ ప్రభుత్వానికి తాజా వినతి
భోళా శంకర్ సినిమా విడుదలకు మేకర్స్ రంగం సిద్దం చేసారు. ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి వర్కింగ్ స్టిల్స్ లో యమ స్టైలిష్ గా కనిపించారు. దర్శకుడు మోహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్దమైంది.

తమన్నా, కీర్తి సురేశ్ నటించిన ఈ మూవీ మెగాస్టార్ కు 154వ సినిమా. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ బలంగా ఉంటుందని ఇప్పటికే స్పష్టం అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ సినిమా పైన మరింత అంచనాలు పెంచేసారు. వాల్తేరు వీరయ్యను దాటి పోయేలా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
చిరంజీవి వ్యాఖ్యల వివాదం
ఇదే సమయంలో వాల్తేరు వీరయ్య 200రోజుల ఫంక్షన్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలంగా మారాయి. పిచ్చుక లాంటి సినీ పరిశ్రమపైన పడకుండా, ప్రత్యేక హోదా, రోడ్లు బాగుచేయటం, పేదలకు సంక్షేమం వంటి వాటి పైన ఆలోచన చేయాలని పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యలు చేసారు.
దీనికి ఏపీ మంత్రులు సీరియస్ గా స్పందించారు. గట్టి కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి ముందుగా పవన్ కు హితవు చెప్పాలని సూచించారు. మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో సినిమా విడుదలకు ముందు భోళా శంకర్ మూవీ మేకర్స్ నుంచి ఏపీ ప్రభుత్వానికి టికెట్ ధరల పెంపుకు అనుమతి కోరుతూ అభ్యర్ధన అందింది. దీని పైన ప్రభుత్వం వివరణ కోరింది.
ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
ప్రభుత్వం సినిమా నిర్మాణానికి సంబంధించి వివరాలు కోరినట్లు గా తెలుస్తోంది. బడ్జెట్ ఆధారంగా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని గతంలో పాలసీ నిర్ణయంగా తీసుకున్నారు. టికెట్ ధరల పెంపు పైన గతంలో చిరంజీవి నాయకత్వంలో సినీ టీం నేరుగా సీఎం జగన్ తో చర్చలు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అప్పట్లోనే చిరంజీవి స్వాగతించారు.

ఇప్పుడు చిరంజీవి ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భోళా శంకర్ టికెట్ ధరల పెంపు విషయంలో తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది. అయితే, సీఎం జగన్ తో కొద్ది కాలంగా క్రితం వరకు చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యల తరువాత ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో మూవీ మేకర్స్ ప్రభుత్వం అడిగిన సమాచారం ఇవ్వటానికి సిద్దమయ్యారు. దీంతో, ఏపీ ప్రభుత్వం భోళా శంకర్ టికెట్ ధరల విషయంలో తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications