ఉగ్ర దాడి: 'పాకిస్తాన్ పైన సుదర్శన చక్రం ప్రయోగానికి సమయం ఆసన్నమైంది'
విశాఖ: యూరిలో ఉగ్రవాదుల దాడి పైన ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సోమవారం నాడు స్పందించారు. పాకిస్తాన్ ఆగడాలు మితిమీరాయన్నారు. వెంటనే సుదర్శన చక్రం ప్రయోగించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. పాక్కు, ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన శాస్తి చేయాల్సిందే అన్నారు.
ఉగ్రదాడి పైన ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా కూడా స్పందించారు. యుద్ధం పరిష్కారం కాకపోయినా మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదంటే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. కేవలం దవడ పగలగొట్టేలా చెప్పడం కాదని, పాక్తో పాటు పాక్ ప్రేరిత ఉగ్రవాదుల దవడలు నిజంగానే పగలగొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేవలం ప్రకటనలు చేయడంతో సరిపోదన్నారు.
పాక్పై ప్రతిదాడి చేయాలని నెటిజన్లు
జమ్మూ కాశ్మీర్లోని యూరి సెక్టార్ పైన ఉగ్రవాదుల దాడికి ప్రతి దాడి చేసి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని ఎక్కువమంది నెటిజన్లు కోరుకుంటున్నారు. ఉగ్రదాడి పైన సోషల్ మీడియా పెద్ద ఎత్తున అమరజవాన్లకు నివాళులు అర్పించింది. అదే సమయంలో ఉగ్రవాదుల పైన విరుచుకుపడుతోంది.
నెటిజన్లకు సంబంధించి ఒక ఆంగ్ల పత్రిక ఆన్లైన్లో ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో.. పూర్తి ఆయుధసామగ్రితో పాకిస్థాన్ పైన విరుచుకుపడాలని కోరుకుంటున్న వారు 66.6 శాతం, అంతర్జాతీయంగా పాక్ను ఏకాకిని చేయాలనేవారు 25 శాతం, పాకిస్తాన్తో యుద్ధం ప్రమాదకరమనే వారు 4.6 శాతం, పాకిస్థాన్ను చాలా గట్టిగా హెచ్చరించాలని 3.8 శాతం మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.