'టీవీ9 క్షమాపణ చెప్పినందున, మరో రెండు ఛానళ్ల పైన'
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను, సమాజాన్ని కించపర్చేవిధంగా ఇక ముందు మీడియా వ్యవహరిస్తే ఉపేక్షించకుండా కఠిన వైఖరిని అవలంభించాలని శాసనసభా పక్షం నాయకులు, పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అవమానించిన మీడియా సంస్థ పైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనిపై వివిధ పార్టీలు భిన్నంగా స్పందించాయి.
టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ, చానల్ ప్రసారం చేసిన కథనం యావత్తు తెలంగాణ ప్రజలను, ప్రజాప్రతినిధులను అవమానించినట్టుగా ఉందని, సదరు చానల్పై కఠిన చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒక్క చానల్ పైనే కాకుండా తమను ప్రతినిత్యం అవమానించే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్న మరో రెండు చానళ్లపై కూడా చర్య తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధులను అవమానపర్చిన చానల్పై చర్య తీసుకోకుండా, విషయాన్ని పక్కదారి పట్టించవద్దని టిడిపి నాయకులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుదాకర్ రెడ్డి సూచించారు. సదరు ఛానల్ శాసనసభకు క్షమాపణ చెబుతూ లేఖ రాసిందని, క్షమాపణ చెప్పిన తర్వాత కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస, కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బిజెపి సభ్యుడు కిషన్ రెడ్డి.. తెలంగాణ తొలి శాసనసభా సమావేశాల్లోనే మీడియాపై చర్య తీసుకోవడం సరికాదని, సభకు క్షమాపణ చెప్పడంతో ఈసారికి వదిలి వేయాలని, అయితే మెజార్టి సభ్యులు తీసుకునే నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. మరోవైపు మజ్లిస్ పార్టీ సభ్యుడు ఖాద్రీ కూడా టీవీ 9 క్షమాపణ చెప్పినందున ఈ ఒక్కసారికి హెచ్చరించి వదిలేద్దామని సూచించారు.
ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొద్దిగా తడబడితే, తానోదో చేయనిరాని నేరం చేసినట్టుగా అవమానపరుస్తూ సదరు ఛానల్ పదేపదే క్లిపింగ్లు ప్రదర్శించి అవమానపర్చిందని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ విలపించారు.