అప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు: టిపై కిరణ్, రాలేమనొద్దని
హైదరాబాద్: సమస్యలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడని, సంతోషం ఉన్నప్పుడు మాత్రం గుర్తుకు రాడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం అన్నారు. అందరిదీ అదే పరిస్థితి అని, అలాంటి సమయమే ఇప్పుడు వచ్చిందని పరోక్షంగా విభజన అంశాన్ని ఉద్దేశించి అన్నారు. ఈ తరుణంలో మనందరి జీవితంలో వెలుగు నింపాలని, అందరి సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రతి ఒక్కరుమనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించాలని వ్యాఖ్యానించారు.
క్రిస్మస్ సందర్భంగా జూబ్లీహాలులో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ పై వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ కూడా పాల్గొన్నారు.

బాగాలేవనొద్దు
రాజకీయాలు బాగాలేవని, రాలేమని యువత అనవద్దని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రానికి ఇండియా టుడే బెస్ట్ గవర్నెన్స్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఉస్మానియా వర్శిటీ, ఇతర విద్యాసంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు.
రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. దేశానికి, రాష్ట్రానికి విద్యార్ధులే ఆశాజనకమని వ్యాఖ్యానించారు. వారికి సరైన మార్గదర్శనం చేస్తే ప్రపంచాన్నే జయించే శక్తి ఉన్నవారు విద్యార్ధులని కితాబునిచ్చారు. రాజకీయ రంగం ఆశించిన స్థాయిలో లేనందువల్ల దానికి దూరంగా ఉండాలన్న యువత భావన సరికాదని హితవు పలికారు. మంచివారు, యువత రాజకీయాల్లోకి వస్తేనే ప్రజలకు మంచి పాలన అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లోకి వస్తే ఇబ్బందులు వస్తాయన్న భయంవద్దని, సమస్యల నుంచి ఎప్పుడూ పారిపోవద్దని ధైర్యం చెప్పారు. యువతతోనే రాష్ట్రం, దేశం బాగుంటుందన్నారు. గుడ్ గవర్నెన్స్ అవార్డు తన ఒక్కడికే వచ్చింది కాదని, మంత్రివర్గంలోని సహచరులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషితో అవార్డు సాధ్యమైందని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణలో, ఇప్పుడు సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయని, అయినా సమస్యలను అధిగమించి అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications