రోజాను లోపల నిర్బంధించి టీడీపీ వ్యతిరేక నినాదాలు
హైదరాబాద్/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత, నగరి శాసన సభ్యురాలు రోజాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు బుధవారం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోజా ప్రోటోకాల్ పాటించడం లేదంటూ టీడీపీ కౌన్సిలర్లు చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేశారు.
రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో రోజా మున్సిపాలిటీ కార్యాలయంలోనే ఉన్నారు. నగరి మున్సిపాలిటీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రోజా అక్కడే ఉన్నారు. టీడీపీ కౌన్సిలర్లు రోజాను నిర్బంధించారు.
ఎయిమ్స్ కోసం భూమి సేకరణ: మంత్రి కామినేని
గుంటూరు - విజయవాడ మధ్య ఎయిమ్స్ ఆసుపత్రి కోసం 150 ఎకరాల భూమి సేకరించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర బృందం రేపు రాష్ట్రానికి వచ్చి ఆ భూములను పరిశీలిస్తుందని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో మెడికల్ ఫీజులపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే న్యాయస్థానానికి వెళ్తామన్నారు.
పోలవరం అంశంపై ధర్నా
పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలం కన్నయ్యగూడెంలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆందోళనకారుల రాస్తారోకోతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.