టీడీపీ ఎంపీ అభ్యర్దుల ఖరారు - ఎవరెక్కడ...!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. టీడీపీ, జనసేన తమ అభ్యర్దులను ప్రకటిస్తున్నాయి. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్దుల పైన దాదాపు స్పష్టత వచ్చింది. టీడీపీ రెండు విడతులుగా తమ అసెంబ్లీ అభ్యర్దులను ప్రకటించింది. ఇప్పుడు ఎంపీల జాబితా సిద్దం చేసారు. ఈ జాబితాను ఈ రోజు చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
టీడీపీ కసరత్తు
టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనకు కేటాయించినట్లు సీట్లను మినహాయిస్తే 144 అసెంబ్లీ, 17ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. వీటిలో ఇప్పటికి రెండు జాబితాల్లో కలిపి 128 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా 16 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు టీడీపీ ప్రకటించిన సీట్లలో బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కలిపి 45శాతం (58సీట్లు) దక్కాయి. ఇందులో ఎస్సీలకు 27, బీసీలకు 24, ఎస్టీలకు 4, మైనారిటీలకు 3 లభించాయి. రెడ్డి సామాజిక వర్గానికి 28, కమ్మ-28, కాపు-8, క్షత్రియ-5, వెలమ-1, వైశ్యులకు రెండు, దక్కాయి. ఒకటి రెండు రోజుల్లోనే పెండింగ్ ఎమ్మెల్యేల జాబితా ప్రకటించనుంది. ఈ రోజు ఎంపీల లిస్టు ప్రకటించేందుకు రంగం సిద్దమైంది.

ఎంపీ అభ్యర్దులు
ఇక..పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6, జనసేనకు 2 ఎంపీ స్థానాలు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ 17 స్థానాల్లో పోటీచేయనుంది. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్దులు దాదాపు ఖరారయ్యారు. అందులో శ్రీకాకుళం-కింజరాపు రామ్మోహన్నాయుడు, విశాఖపట్నం-ఎం.భరత్, విజయవాడ-కేశినేని శివనాథ్ (చిన్ని), ఒంగోలు-మాగుంట రాఘవరెడ్డి, గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నరసరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు, చిత్తూరు (ఎస్సీ)-దగ్గుమళ్ల ప్రసాదరావు, రాజంపేట-సుగవాసి బాలసుబ్రమణ్యం, నంద్యాల-బైరెడ్డి శబరి. ఇంకా అమలాపురం(ఎస్సీ), బాపట్ల(ఎస్సీ), కర్నూలు, కడప, ఏలూరు, అనంతపురం, హిందూపురం స్థానాలకు అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
మార్పులు - చేర్పులు
అయితే, బీజేపీకి ఇచ్చిన స్థానాల పైన కొంత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బీజేపీ తమకు విశాఖ కావాలని పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం విశాఖ ఇవ్వలేమని చెబుతున్నట్లు తెలుస్తోంది. జనసేన కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేయనుంది. కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నా..తనకు ఎంపీగా పోటీ చేయటం ఇష్టం లేదని..తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ స్పష్టం చేసారు. దీంతో, బీజేపీ నుంచి తుది నిర్ణయం జరిగిన తరువాత ఎంపీ సీట్ల పైన క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా.. చంద్రబాబు తమ పార్టీ పోటీ చేసే ఎంపీ అభ్యర్దుల జాబితా ప్రకటనకు సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications