జగన్ విధ్వంసకుడు.. మడమ తిప్పడానికి సిగ్గులేదా.. వైసీపీ సర్కార్పై చంద్రబాబు నిప్పులు
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. నమ్మకంతో ప్రజలు వైసీపీకి ఓట్లేస్తే వారి నమ్మకాన్ని జగన్ ఒమ్ము చేశారని మండిపడ్డారు. ప్రజావేదిక విధ్యంసంతో జగన్ పాలన మొదలైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనకంటే వైసీపీ పాలనతోనే ఏపీ కోలుకోని విధంగా నష్టపోయిందని చంద్రబాబు విమర్శించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తెస్తామని చెప్పి.. జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర భవిష్యత్తుకు ఇబ్బందే..
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలందరూ ఆలోచించాలన్నారు చంద్రబాబు. నాకేం సంబంధం లేదని భావిస్తే రాష్ట్ర భవిష్యత్తుకు ఇబ్బందేనని అన్నారు. సీఎం జగన్ విధ్వంసకుడుని మండిపడ్డారు. ప్రజావేదిక విధ్వంసంతోనే జగన్ తన పాలన ప్రారంభించారన్నారు. ప్రజల ఆస్తి విధ్వంసంతో వారి ఉన్మాదం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాధాని కోసం భూములు ఇచ్చిన పాపానికి రైతులను అవమానిస్తారా.. అని చంద్రబాబు నిలదీశారు. అమరావతి , పోలవరం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
జగన్ విధ్వంసకుడు..
అమరావతిలో ప్రతిష్టాత్మకంగా తమ టీడీపీ ప్రభుత్వం కట్టించిన భవనాలను నిరుపయోగంగా వదిలేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు . జగన్ విధ్యంసకర చర్యలతో అమరావతిలో రూ. 2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని మండిపడ్డారు. మాటల తప్పడం మడమ తిప్పడం జగన్కు అలవాటైదని దుయ్యబట్టారు. నాడు సైబరాబాద్ కూడా గ్రాఫిక్స్ అని విధ్వంసం చేసుంటే ఇవాళ హైదరాబాద్ ఎక్కడుండేదని ప్రశ్నించారు. పోలవరంపై ఎన్నో ఆరోపణలు చేసిన వేసీపీ నేతలు.. ఇప్పుడు రూ. 10 వేల కోట్లకు పైనే అదనంగా ఖర్చయ్యేలా ఉందన్నారు. 2021 నాటికి పోలవరం పూర్తిచేస్తామన్న పెద్ద మనుషులు ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు.
రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలనతోనే ఏపీకి నష్టం..
మహమ్మారి కరోనాతో ప్రపంచ దేశాలు నష్టపోతే.. వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకంటే జగన్ పాలనతో రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా తయారుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందనని తెలిపారు. కనీసం ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. ఇష్టాను సారం అప్పులు చేసి దానికి సంక్షేమం అని పేరు పెడుతున్నారని దుయ్యబట్టారు. అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Recommended Video
దమ్ముంటే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించండి..
ఏపీలోని రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. ఏ పంటలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టిన ఆంధ్రప్రదేశ్లో వరి వేయొద్దనని జగన్ ప్రభుత్వం చెబుతుందని మండిపడ్డారు. సామాన్యుడు కొనలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్నారు. దమ్ముంటే నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతికంగా మాట్లాడితే కేసులు.. ప్రజా సమస్యలపై పోరాడితే దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, మద్యంపై పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.