TDP: పంజరంలో రామచిలకలా చంద్రబాబునాయుడు??
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పంజరంలో రామచిలుకలా బంధింపబడ్డారా? నియోజకవర్గాల్లో పార్టీ వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ఆయన తనచుట్టూ ఉన్న కోటరీ నుంచి బయటకు రాలేకపోతున్నారా? వాస్తవ సమాచారాన్ని బాబు దగ్గరకు రానీయకుండా కోటరీ అడ్డుకుంటోందా? అనే ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి ఔననే సమాధానం వస్తోంది.

చంద్రబాబు చుట్టూ కోటరీ?
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేవరకు కూడా చంద్రబాబు చుట్టూ ఒక కోటరీ ఉంటుందని, ఆయనకు వాస్తవాలు తెలియకుండా ఈ నేతలంతా అడ్డుకుంటున్నారంటూ పార్టీలో బహిరంగంగానే మాట్లాడుకునేవారు. చంద్రబాబుపై మీడియాలో కూడా ఈ కోణంలోనే వార్తలు వచ్చేవి. ఆయన తన కోటరీని దాటుకొని క్షేత్రస్తాయిలో స్వయంగా వాస్తవ సమాచారాన్ని తెలుసుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.

ప్రస్తుతం ఏపీకి చంద్రబాబే దిక్కు
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రస్తుతం అధ్వాన్నంగా ఉందని, రాజధాని కూడా లేకుండా, అభివృద్ధి లేకుండా అధోగతి పాలైందని, ఇటువంటి పరిస్థితుల్లో ఏపీని అభివృద్ధి చేయగలిగేది చంద్రబాబునాయుడు ఒక్కడే అనే ఆలోచనకు ప్రజలంతా వచ్చారని, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించుకుంటూ వస్తే సులభంగా అధికారం చేజిక్కించుకోవచ్చనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచనగా ఉంది. అయితే పార్టీకి ఉన్న సమస్యలు ఏమిటనేది తెలుసుకోవాలంటే చంద్రబాబు తన కోటరీ దాటి రావాలని కోరుతున్నారు.

మొహమాటాన్ని వదిలించుకోవాలి
చంద్రబాబు కోటరీలో గతంలో కొందరు వ్యక్తులు ఉండేవారని, వారిలో కొందరు పార్టీ మారారని, అయినప్పటికీ మళ్లీ మరో కోటరీ తయారైందని పార్టీ కేంద్ర కార్యాలయవర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు స్వతహాగా మొహమాటస్తుడని, ఆయన మొహమాటాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర కార్యాలయంలో ఆయనకు దగ్గరై ఎవరైనా బాబు దగ్గరకు వెళ్లాలంటే తమను దాటి వెళ్లాలి అనేలా తమను తాము రూపొందించుకున్నారని, వారంతా వాస్తవ పరిస్థితులను బాబుకు తెలియజేయడంలేదని, గత ఎన్నికల్లో ఓటమి పాలవడానికి కూడా ఇదే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా చంద్రబాబునాయుడు తన కోటరీని ఛేదించి పంజరం నుంచి బయట పడిన రామచిలుకలా స్వేచ్ఛగా ఉంటూ పార్టీకి ఇబ్బంది కలిగించే నాయకులను దూరం పెడుతూ, కోవర్టులుగా ఉన్నవారిని పార్టీనుంచి బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కృషిచేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications