తెలంగాణలో ఐదు ఎంపీ సీట్లపై కన్నేసిన చంద్రబాబు
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న మూడు లోకసభ స్థానాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కన్నేసినట్లు అర్థమవుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన ఖమ్మం, ఆదిలాబాద్ స్థానాలతో పాటు మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబాబాద్ సీట్లను గెలుచుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం తెలంగాణలో ఆదిలాబాద్, ఖమ్మం స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబాబాద్ సీట్లను గెలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మల్కాజిగిరిలో పెద్ద సంఖ్యలో సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ సీటుపై లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ సీటుపై సీమాంధ్ర నాయకులు పలువురు దృష్టి సారించారు

చేవెళ్లలో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి వ్యతిరేకత ఉందని, అదే సమయంలో సీమాంధ్ర ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారని, దీంతో ఈ సీటును గెలుచుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో చేవెళ్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఎపి జితేందర్ రెడ్డి 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో బిజెపికి లక్ష ఓట్ల దాకా పోలయ్యాయి. బిజెపితో పొత్తు ఉంటే ఈ సీటును దక్కించుకోవడం సులభమని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.
ఖమ్మం లోకసభ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోగలిగితే మహబూబాబాద్ సీటు కూడా తమకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. మహబూబాబాద్ వరంగల్లో ఉన్నప్పటికీ ఈ లోకసభ స్థానంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాలున్నాయి. ఖమ్మం జిల్లాలో పార్టీకి ఉన్న బలంతో ఆ సీటును దక్కించుకోవచ్చునని ఆశిస్తున్నారు. అదే సమయంలో ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బలహీనంగా ఉంది. అయితే, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తే, సిపిఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ తెరాసతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి ఆ సీటును దక్కించుకోవడం కష్టమే కావచ్చు.
ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎంపి రమేష్ రాథోడ్కు ఉన్న మంచి పేరుతో గట్టెక్కవచ్చునని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలోని సీమాంధ్రల ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోయాయని, ఈసారి తమ పార్టీకి గంపగుత్తగా ఓటేస్తారని తెలుగుదేశం నాయకులు నమ్ముతున్నారు. అయితే, టిడిపి ఆశిస్తున్న మూడు లోకసభ స్థానాలపైనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా గురిపెట్టింది.












Click it and Unblock the Notifications