YSRCP ఎమ్మెల్యేలు మాతో టచ్ లోనే ఉన్నారు
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అనూహ్యంగా ఒక బాంబు పేల్చారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అనూహ్యంగా ఒక బాంబు పేల్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోటా ఎన్నికలు హాట్ హాట్ గామారిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున పంచుమర్తి అనురాధ బరిలోకి దిగారు. దీనికి సంబంధించి మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమకు టచ్ లోనే ఉన్నారన్నారు. చివరి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా ఇప్పటివరకు ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదని, సభలో 17కు పైగా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నామన్నారు.
తెలుగుదేశంపార్టీ పొత్తులకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలనే గట్టి సంకల్పంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని, ఇందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తమ అభ్యర్థిని పోటీ కి దింపామని, రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణమన్నారు. ప్రస్తుతానికి పవన్, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలపై పోరాడుతున్నారని, ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులకు సంబంధించిన ప్రకటన చేస్తారన్నారు. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, బీసీ మహిళను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపాం కాబట్టి గెలుపు సొంతమవుతుందని, టీడీపీకి 23 మంది సభ్యుల బలముందనే విషయాన్ని స్పీకర్ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారన్నారు. చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేవిధంగా కూడా ప్రయత్నించడంలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలున్నాయి. ఏడు ఏకగ్రీవమవుతాయని అనుకున్నప్పటికీ చివరి నిముషంలో తెలుగుదేశం పార్టీ తరఫున పంచుమర్తి అనురాధ బరిలోకి దిగారు. 23 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే అనురాధ గెలవడం ఖాయమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటివారు ఓటువేసినా చాలంటున్నారు. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్ రోజు సభకు వస్తారా? రారా? అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది.












Click it and Unblock the Notifications