చంద్రబాబు అరెస్ట్ లో కేంద్రం పాత్ర - టీడీపీ డైరెక్ట్ ఎటాక్..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కర ములుపులు తీసుకుంటోంది. చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటి వరకు వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అటు చంద్రబాబు హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లు ఈ నెల19కి వాయిదా పడ్డాయి. ఆ తరువాతనే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో పలువురు చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
మారుతున్న సమీకరణాలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తోంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఇప్పటి వరకు టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని..సీఎం జగన్ ను టార్గెట్ చేసారు. ఏపీలో బంద్ కు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ తో రాజకీయ వేధింపుల్లో భాగంగానే తన పైన కేసు నమోదు చేసారని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ పైన ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుంచి ఎవరూ స్పందించ లేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అరెస్ట్ సమయంలో ఖండించినా, ఆ తరువాత ఎక్కడా ప్రస్తావన చేయటం లేదు.

అయ్యన్న సంచలనం
అటు పవన్ మాత్రం చంద్రబాబుకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు. రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఈ సమయంలోనే టీడీపీ సీనియర్ నేత అయ్యన్ పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ పరిణామాలు ఢిల్లీ పెద్దలకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ లో ఢిల్లీ పెద్ద పాత్ర ఉన్నందుకే మాట్లాడటం లేదా అని కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రం పెద్దల మౌనం దేనికి సంకేతం అని నిలదీసారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ దిగజారి పని చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసారు. మోదీ, షా జీ 20 సదస్సులు పెట్టి ఏం ఉపయోగమంటూ వ్యాఖయానించారు. ఏపీలో ఏం జరుగుతోందా పట్టించుకోరా అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బీజేపీ ఏం చేయబోతోంది
అటు ఇండియా భాగస్వాములుగా ఉన్న మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాళీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వంటి నేతలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి స్పందించారు. ఎన్డీఏ కూటమి నుంచి పవన్ కల్యాణ్ మినహా ఎవరూ స్పందించలేదు. దీంతో అటు బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఎవరూ ఈ సమయంలో స్పందించకపోవటం పైన టీడీపీ నేతలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంనేది చూడాలి.












Click it and Unblock the Notifications