డిప్యూటీ సీఎం గా లోకేష్ - చంద్రబాబు వద్ద ప్రతిపాదన, ఆ వెంటనే..!!
సీఎం చంద్రబాబు కు పార్టీ నేతల నుంచి అనూహ్య డిమాండ్ వచ్చింది. ముఖ్యమంత్రి కడప జిల్లా మైదుకూరులో సభలో పాల్గొన్నారు. ఆ సమయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి కీలక ప్రతిపాదన చేసారు. మంత్రి లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని సభా వేదిక గా అందరి సమక్షంలోనే విజ్ఞప్తి చేశారు. పార్టీ - ప్రభుత్వంలో లోకేష్ చేస్తున్న కృషిని వివరించారు. దీంతో, ముఖ్యమంత్రి స్పందన ఆసక్తి కరంగా మారింది. చంద్రబాబు ఈ సభలో నదుల అనుసంధానం గురించి వివరించారు.
సీమకు గోదావరి నీరు
ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన స్వేచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడని, రెండేళ్లల్లో దాన్ని పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమకు గోదావరి నీటిని తీసుకువస్తామని, సీమ రైతులు మీసం తిప్పేలా చేస్తానని సీఎం చెప్పారు. బనకచర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవిత ఆశయమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

చంద్రబాబు సమక్షంలో
ఇదే సభలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సమక్షంలో లోకేష్ ప్రస్తావన చేసారు. రాష్ట్రాభివృద్ధి కోసం లోకేశ్ చేస్తున్న కృషిని గుర్తించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. అన్ని రకాలుగా యువతను పోత్సహించే విధంగా ఐటీ, పారిశ్రామి క రంగాలకు చెందిన అనేక పరిశ్రమలను ఏపీకి తెచ్చేందుకు లోకేశ్ విశేష కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో పార్టీకి, యువతకు భరోసా ఇవ్వాలంటే లోకేశ్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని ప్రతిపాదన చేసారు. కొద్ది రోజులగా టీడీలో ఈ ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. కానీ, ప్రస్తుత డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కరే ఉన్నారు. ఆయనకు ఆ హోదా ఇవ్వాలనే ఉద్దేశంతో మరెవరికీ అవకాశం ఇవ్వలేదు.
చంద్రబాబు ఆలోచన ఏంటి
కాగా, ఇప్పుడు లోకేష్ కు అదే హోదా ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో పెరుగుతోంది. తన ముందే ఈ రకమైన ప్రతిపాదన వచ్చినా చంద్రబాబు స్పందించలేదు. తన ప్రసంగం కొనసాగించిన చంద్రబాబు వేంకటేశ్వరస్వామి పాదాల వరకూ గోదావరి నీటిని తీసుకువస్తామని, బనకచర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవిత ఆశయమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కడప స్టీల్ప్లాంట్, కొప్పర్తి ఇండస్ట్రీయల్ కారిడార్ త్వరలోనే పూర్తి చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. జనవరి చివరికల్లా వాట్సాప్ గవరెన్స్ తీసుకొస్తామని, గండికోటను టూరిజం హబ్గా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications