బాబుకు దెబ్బ: తెరాసలోకి జైపాల్, జగన్ పార్టీ నేత
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెలుగుదేశం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వలసలు ఆగడం లేదు. తాజాగా శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ తెరాసలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెసుకు కూడా షాక్ తగులుతోంది. మెదక్ జిల్లా పటాన్చెర్వు శాసనసభ్యుడు నందీశ్వర్ గౌడ్ కూడా తెరాసలో చేరడానికి సిద్ధపడ్డారు.
కాగా, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, టీజేఏసీ కో-చైర్మన్ వి.శ్రీనివాస్గౌడ్ ఆదివారం తెరాసలో చేరుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కూడా ఆయన వెంట తెరాసలోకి రానున్నారు. ఈ విషయాన్ని శ్రీనివాస్గౌడ్ ధ్రువీకరించారు.
కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు మాజీ నేత పుట్ట మధు, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మాజీ శాసనసభ్యుడు దివాకర్రావు కూడా ఆదివారమే తెరాసలో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దివాకర్రావుతో తెరాస అధ్యక్షుడు శుక్రవారం ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.
కాగా, తెరాస ఎమ్మెల్యే హరీశ్రావుతో కలిసి ఫామ్ హౌస్కు వచ్చిన మెదక్ జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ కెసిఆర్ను కలిశారు. తెరాసలో చేరేందుకు అంగీకరించారు. తనకు పటాన్చెరు టికెట్ ఇవ్వాలని కోరగా అందుకు కేసీఆర్ అంగీకరించినట్లు తెలిసింది.
ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని తన ఇంటికి వచ్చిన కెసిఆర్ను తెలుగుదేశం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కలిసినట్లు తెలిసింది. తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్, మెడికల్ జేఏసీ గ్రేటర్ అధ్యక్షుడు డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం కెసిఆర్ను కలిశారు. మహబూబ్నగర్ జిల్లా తెలుగుదేశం నేతలు మాడెమోని నర్సింహులు, ఎం.రవీందర్ రెడ్డి, యాదిరెడ్డి, కె.ప్రతాప్, సి. మధుసూదన్ రెడ్డి, పి.జయసింహా రెడ్డి, వెంకటేశ్ తదితరులు తెరాసలో చేరారు.