గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు: బాధితులకు అండగా..ధైర్యాన్ని ఇస్తూ..
విశాఖపట్నం: విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువుల లీకేజీ ఘటనపై తెలుగుదేశం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతినిక వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గణబాబు.. ఈ ఉదయం నుంచి గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆసుప్రతుల్లో చికిత్స పొందుతోన్న వారినీ పరామర్శిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కొనసాగుతోన్న ఆర్ఆర్ వెంకటాపురం సహా పలు ప్రాంతాల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. విష వాయువు విడుదలైన సమాచారం తెలుసుకున్న వెంటనే విశాఖపట్నం పశ్చిమ, విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ హుటాహుటిన సంఘటానా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరు వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థకు చేరుకున్న గణబాబు.. సంస్థ ఉద్యోగులతో మాట్లాడారు. గ్యాస్ లీకేజీకి సంబంధించిన వివరాలను ఆరా తీశారు.
విషవాయువులు వెలువడటం పట్ల అపార నష్టం సంభవిస్తుందనే భయాందోళనలను ఆయన వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, నగర పోలీసులు యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతోన్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు. దీనికోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
అదే సమయంలో వెలగపూడి రామకృష్ణ ఆర్ఆర్ వెంకటాపురంలో పర్యటించారు. ఇందిరానగర్, నాయుడుతోట, కొత్తపాలెం, భగత్సింగ్ నగర్, మాధవాపురం, సింహపురి కాలనీల్లో ఆయన బాధితులను కలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రజలకు అండగా నిల్చుంటామని అన్నారు. ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని సూచించారు. బాధితులకు పార్టీ తరఫున సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.