అసలు బిజెపి ఎంపి జీవీఎల్కు ఏపీ రాజకీయాలతో సంబంధమేంటి?:టిడిపి ఎంపి కనకమేడల
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు స్కాములుగా అభివర్ణించడం దుర్మార్గమని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
అసలు ఏపీ రాజకీయాలతో ఎంపి జివిఎల్ కు ఏమి సంబంధం అని...రాష్ట్ర రాజకీయాలతో ఎంతమాత్రం సంబంధం లేని వ్యక్తి జీవీఎల్ నరసింహారావు అని ఎంపి కనకమేడల దుయ్యబట్టారు. ఎంపి జీవీఎల్ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని, ప్రజల బాగోగులతో తమకు సంబంధం లేదనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెప్పించే శక్తి ఎంపి జీవీఎల్కు లేదన్నారు. యూసీలు, పీడీ అకౌంట్లు, పోలవరం అవినీతి అంటూ జివిఎల్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా టిడిపి ఎంపి కనకమేడల విమర్శల వర్షం కురిపించారు. కన్నా లక్ష్మీనారాయణ ఎపి బిజెపి అధ్యక్షుడేనా లేక డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నారా?...అని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్ల అంశంలో తమపై వస్తున్న ఆరోపణలను ఖండించలేని స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందని ఎంపి కనకమేడల ఎద్దేవా చేశారు.

అంతకుముందు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించారు. అలాగే ప్రధాని మోడీకి దగ్గరగా ఉన్న ఇతర పార్టీల సీఎంలు ఎవరున్నారనే అంశంపై కూడా చర్చ జరిగింది. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గెలవరని తెలిసి 2014లో బీజేపీకి 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వంటి వారు బీజేపీకి దగ్గరవుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్ ఫినిష్ చెయ్యాలని చూశారని...కానీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాల్లో వాళ్లు ఎలా ఎదగాలో చూడకుండా...మనల్ని అడ్డుకోవడం కోసమే కొందరు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్, జగన్ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రతిపక్షాలకు బదులు ఇవ్వాలని సూచించారు.












Click it and Unblock the Notifications