తెలుగువాళ్లు క్షమించరు: మోడీపై ‘సత్యసాయి’గా శివప్రసాద్ ఫైర్, ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు.
ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సత్యసాయి వేషాధారణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు చేశారు.
'నేను అనంతపురం జిల్లాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా భక్తులను సంపాదించుకోగలిగాను. నాకు వచ్చిన నిధులతో ప్రజాహిత కార్యక్రమాలు చేశాను. సత్యసాయి ట్రస్ట్ ద్వారా అనేక గ్రామాలకు తాగునీరు అందించాను. విద్యాలయాలు, ఆస్పత్రులు నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచాను' అని సత్యసాయిబాబా వేషాధారణలోని శివప్రసాద్ తెలిపారు.
'2004లో మోడీ నా దగ్గరకు వచ్చారు. నువ్వు భవిష్యత్తులో తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని ఆశీర్వదించాను. కానీ, ప్రధాని అయ్యాక మోడీ ఆ స్థాయికి తగ్గట్లుగా ప్రవర్తించడం లేదు. దీంతో ఆనాడు నేనిచ్చిన సందేశాలు ఆయనకు గుర్తు చేయడానికే ఇక్కడికి వచ్చాను' అని శివప్రసాద్ వ్యాఖ్యానించారు.
'తెలుగు ప్రజలు చాలా గొప్పవారు. వారి ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోరు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెబుతున్నా.. తెలుగు ప్రజల దెబ్బ రుచి చూడాలంటే ఇంకా తప్పులు చెయ్. వారు నిన్ను క్షమించరు. నీ పతనాన్ని చూస్తారు. మోడీ పతనం ఖాయం' అని శివప్రసాద్ చెప్పుకొచ్చారు.
కేంద్రం ఇచ్చిన హామీలు నెలబొట్టుకోవాలని ఎంపీలు టీజీ వెంకటేష్, రామ్మోహన్నాయుడు డిమాండ్ చేశారు. రైల్వే జోన్ ఇస్తామని పార్లమెంటు చెప్పి.. కోర్టులో ఇవ్వలేమని అఫిడవిట్లు దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీలు మురళీమోహన్, టీజీ వెంకటేష్, రామ్మోహన్నాయుడు, బుట్టా రేణుక, తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.