చంద్రబాబు ప్లాన్: అసలుకే ఎసరు, ఎన్టీఆర్ను చేసినట్లే జగన్ను చేస్తారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా చావుదెబ్బ తీసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేసి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రతిపక్ష హోదాకు గండి కొట్టడమే కాకుండా శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్షం కూడా దక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడి మాటలను బట్టి చూస్తే అదే అనిపిస్తోంది. తెలంగాణలో టిడిపి శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్రావు స్పీకర్కు లేఖ రాయడం, ఆయన దానిని ఆమోదించడం తెలిసిందే. అది చెల్లదని టిడిపి నేత రేవంత్రెడ్డి ఎంత వాదించినా ఫలితం లేకుండా పోయింది.
మెజారిటీ సభ్యులు సంతకాలు చేస్తే వారు ఎంపిక చేసుకున్న నేతను శాసనసభాపక్ష నేతగా గుర్తించే అధికారం స్పీకర్కు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ కూడా అదే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను ఒక్కరొక్కరిగా చేర్చుకుంటున్న టిడిపి మొత్తం వైసిపిలో చీలిక తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

మూడింట రెండు వంతలు మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలోకి వచ్చిన తర్వాత వైఎస్జగన్ స్థానంలో జ్యోతుల నెహ్రును ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మళ్లీ శాసనసభా సమావేశాల నాటికి వైసీపీ నుంచి దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తారని అంటున్నారు.
సాంకేతికంగా 67మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 34 మంది తమకు జగన్ మీద విశ్వాసం లేదని, కాబట్టి తమ నాయకుడిగా జ్యోతుల నెహ్రును గుర్తించాలని లేఖ రాస్తే, మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని స్పీకర్ కోడెల గౌరవించాల్సి వస్తుందని అంటున్నారు. ఆ ప్రకారంగా జగన్కు అప్పటివరకూ ఉన్న ప్రధాన ప్రతిపక్షనేత హోదా పోతుంది.
మేనాటికి జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని ఆర్ధిక మంత్రి యనమల, ఆ పార్టీలో చీలికలు వస్తాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు తరచూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక, అసలు మర్మం ఇదేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంప్రదా యం, తీసుకున్న నిర్ణయాన్నే నేటి స్పీకర్ అమలుచేసే అవకాశం కనిపిస్తోంది.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ శాస నసభాపక్ష నేతగా ఉన్న సమయంలో తామంతా చంద్ర బాబునాయుడు నాయకత్వాన్ని సమర్ధిస్తున్నట్లు చంద్రబాబు నాయకత్వంలోని మెజారిటీ ఎమ్మెల్యేలు నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడుకు లేఖ రాశారు. నిబంధ నల ప్రకారం చంద్రబాబునాయుడుకే మెజారిటీ ఉన్నందు న స్పీకర్ చంద్రబాబు నాయకత్వంలోని టిడిఎల్పీని అసలైన టిడిపిగా గుర్తించారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
త్వరలో వైసీపీలో జరగనున్న చీలిక సమయంలో కూడా ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే వైయస్ జగన్కు శాసనసభలో అసలుకే ఎసరు వస్తుంది.












Click it and Unblock the Notifications