సీనియర్లకు ఇదేనా మీరిచ్చే గౌరవం - చంద్రబాబు నిర్ణయంతో మనస్థాపం..!?
టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు నిర్ణయం పైన మనస్థాపానికి గురయ్యారు. ఇదేనా సీనియర్లకు మీరిచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు.
టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు నిర్ణయం పైన మనస్థాపానికి గురయ్యారు. ఇదేనా సీనియర్లకు మీరిచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన స్థానంలో కొత్త నేతకు బాధ్యతలు అప్పగించటం పైన ఆ సీనియర్ నేత తన సన్నిహితులతో వాపోయారు. తన అభ్యర్ధన కనీసం పరిగణలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. తాజాగా టీడీపీ నాలుగు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయమే జిల్లా టీడీపీలో చర్చకు కారణమవుతోంది.
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ టీడీపీ నాలుగు కీలక నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించింది. అందులో భాగంగా..విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా కర్రోతు బంగార్రాజును చంద్ర బాబు నియమించారు. ఈ నిర్ణయం పైన సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి మనస్థాపానికి గురయ్యారు. నెల్లిమర్ల ఇన్ ఛార్జ్ బాధ్యతలు రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజుకి అప్పగించిన నేపథ్యంలో పూసపాటిరేగ మండలం టిడిపి నేతలు సమావేశం అయ్యారు. తనను ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించే ముందు తనకు చెప్పి ఉంటే బాగుండేది అని నారాయణ స్వామి పేర్కొన్నారు. పతివాడ కుటుంబానికి పార్టీలో సముచిత స్ధానం కల్పించాలని ఆయన మద్దతు దారులు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో నారాయణస్వామినాయుడే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ ఓటమి చవిచూశారు.

అయినా అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను ఆయనకే అప్పగించింది. కానీ అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలని అధినేత భావించారు. అయితే తనను తప్పిస్తే కుమారుడికి బాధ్యతలు అప్పగించాలని పతివాడ కోరుతూ వచ్చారు. మరో ముగ్గురు నేతలు నెల్లిమర్ల టీడీపీ ఇంఛార్జ్ కోసం ప్రయత్నాలు చేసారు. కానీ, చివరకు పురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు వైపే మొగ్గుచూపింది. గత కొద్దిరోజులుగా బంగార్రాజు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాడుతున్నారు. ఆర్థికంగా బలమైన నేతగా గుర్తింపు కూడా ఉంది. అయితే, నిర్ణయం తీసుకొనే ముందు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన సీనియర్ నేత పతివాడ నారాయణస్వామితో చర్చించక పోవటం ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది. పార్టీలో సీనియర్ గా ఉన్నా..పతివాడ వివాదాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోవటం పైన నియోజకవర్గంలో టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం పైన చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications