బాబును చూసి కాదు, ఎన్టీఆర్ పేరు చూసి: పార్వతి
హైదరాబాద్: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చూసి ఓటేయలేదని, ఎన్టీఆర్ పేరును చూసి ఓట్లు వేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీ రామారావు 91వ జయంతి సందర్బంగా ఆమె బుధవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి మాట్లాడారు.
ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడం కాదని, ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఆమె అన్నారు. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కోసం పోరాటం చేస్తామని ఆమె చెప్పారు. ప్రజల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆమె అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు ఎప్పుడూ కలిసి ఉండాలని ఆమె ఆశించారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో పోరాటం చేయాలని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications