ఆ విషయంలో నా మనవడే ముందున్నాడు: చంద్రబాబు
టెక్నాలజీ వినియోగంలో తన మనవడు తనకంటే ముందున్నాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.
అమరావతి: టెక్నాలజీ వినియోగంలో తన మనవడు తనకంటే ముందున్నాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టెక్నాలజీ ద్వారా రైతులకు వర్షాల గురించి, తుఫాన్ల గురించి ముందే చెప్పి వారిని కాపాడగలుగుతున్నామని చెప్పారు.
ఈ ప్రగతి ద్వారానే మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీని సామాన్యులకు వరకు తీసుకెళ్లడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలుగుతున్నామని చెప్పారు.
సాంకేతికతను ఎప్పటికప్పుడు తెలుసుకుని ముందుకి వెళితే అద్భుత ఫలితాలు వస్తాయని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు.
మెరుగైన పనితీరు చూపించడానికి టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోందనేది వాస్తవమని చంద్రబాబు చెప్పారు. అంతా బాగుంటే మీడియాకు రాయడానికి ఏమీ ఉండదని, నెగిటివ్ ఉంటేనే చూస్తారనేది వారి ఆలోచన అని అన్నారు.