చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) గెలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తే తప్పకుండా ప్రమాణ స్వీకారానికి వెళ్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సూచించిన మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలను సానుకూలంగానే పరిష్కరించుకుంటామన్నారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పినట్లు గుర్తుచేశారు. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్దతతో కూడుకున్న హామీ అని, రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎంతో నిబద్దతతో కట్టుబడ్డారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించి చంద్రబాబునాయుడితో మాట్లాడతామని చెప్పారు.
నేలకరిచిన వైసీపీ
ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ 135, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను, బీజేపీ 10 స్థానాలకు 8 స్థానాల్లో విజయం సాధించాయి. అధికార పార్టీ వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అలాగే లోక్ సభ నియోజకవర్గాలు మొత్తం 25 ఉంటే తెలుగుదేశం పార్టీ 16, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 4 స్థానాలను గెలుచుకున్నాయి.

స్పీకర్ పదవి కావాలంటున్నారు
కేంద్రంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చిందికానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయింది. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మూడోసారి ఈనెల ఎనిమిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మెజారిటీకి అవసరమైన 272 సీట్లను భారతీయ జనతాపార్టీ సాధించలేకపోయింది. కూటమిలోని మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. కేవలం 240 సీట్లనే సాధించింది. దీంతో టీడీపీ, జేడీయూ లాంటి మిత్రపక్షాల సహకారం తప్పనిసరి అవుతోంది. కేంద్రంలో కీలకమైన శాఖలను అడగాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవాణాశాఖ, జలవనరులశాఖతోపాటు వ్యవసాయశాఖ, లోక్ సభ స్పీకర్ పదవిని కావాలని చంద్రబాబు కోరే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications