విజయవాడకు రేవంత్ - ఏపీ సీఎం జగన్ తో సమావేశం..!?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఏపీ పర్యటనకు రానున్నారు. తెలంగాణ ఫలితాల ముందు రేవంత్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రేవంత్ విజయవాడ వస్తారని సమచారం. విజయవాడకు రేవంత్ వస్తే..ఏపీ సీఎం జగన్ తో సమావేశం అవుతారని చెబుతున్నారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారం విజయవాడ రానున్నట్లు తెలుస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు వస్తున్నట్లు అనధికార సమాచారం. విజయవాడకు తెలంగాణ సీఎం హోదాలో తొలి సారి వస్తున్న రేవంత్ ఏపీ సీఎంతోనూ భేటీ అవుతారని చెబుతున్నారు. ఈ మేరకు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఇప్పటికే ఇద్దరు సీఎంలు స్పష్టం చేసారు. గతంలో కేసీఆర్ ఏపీకి వచ్చిన సమయంలో తాడేపల్లి లోని తన నివాసానికి జగన్ ఆహ్వానించారు. పొరుగు రాష్ట్ర సీఎంగా కేసీఆర్ తో జగన్ సత్సంబంధాలు కొనసాగించారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయిన వేళ జగన్ శుభాకాంక్షలు చెప్పటంతో పాటుగా రెండు రాష్ట్రాల సంబంధాల గురించి ప్రస్తావించారు.
దీనికి స్పందనగా రేవంత్ సైతం రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విజయవాడకు రేవంత్ పర్యటన ఖరారైతే..సీఎం జగన్ ఆయనతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. వచ్చే జూన్ తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాల పరిమితి ముగియనుంది. అదే విధంగా నీటి వివాదాలు..పెండింగ్ విభజన అంశాల పైన ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలకే కట్టుబడి ఉన్నారని చెబుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాజాగా సీఎం రేవంత్ ఆస్పత్రిలో పరామర్శించారు. రాజకీయాలకు అతీతంగా పాలనలో ముందుకు వెళ్తున్నాననే సంకేతాలు ఇచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇక..ఏపీ ప్రభుత్వంతోనూ సత్సంబంధాలే కోరుకుంటున్నట్లుగా స్పష్టం చేసారు. దీంతో..రేవంత్ ఏపీ పర్యటన పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications