తెలంగాణలో స్విచ్ వేస్తే ఏపీలో 'ఫ్యాన్' ఆగాలి.. చంద్రబాబు లెక్క?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు రాజకీయాల్లో చాణక్యుడని, అద్భుతమైన వ్యూహాలు పన్నుతారని పేరుంది. కానీ వైఎస్ జగన్ తో పోల్చుకుంటే వ్యూహాలను అమలుపరచడంలో వెనకబడుతున్నారని, ఇప్పటి తరానికి చేరువయ్యే కొత్త వ్యూహాలుకానీ, కొత్త రాజకీయాలు కానీ చంద్రబాబు చేయలేకపోతున్నారంటూ సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు మరోసారి తన బుర్రకు పదును పెట్టారు.

బీజేపీ నుంచి కొరవడుతున్న స్పందన?
గత ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ వైసీపీకి తెరవెనక సాయం చేయబట్టే గెలిచిందనే విషయం టీడీపీ అంతర్గత చర్చల్లో వస్తుంటుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతివ్వమని అడుగుతున్నారు. కానీ బీజేపీవైపు నుంచి ఎటువంటి స్పందన ఉండటంలేదు. మరోవైపు ఆ పార్టీకి తెలంగాణ ఎన్నికలు అత్యంత కీలకం. కేసీఆర్ ను ఓడించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. దీంతో చంద్రబాబు అటువైపు నుంచి నరుక్కొస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకు 2 శాతంగా ఉంది. దాన్ని 5 నుంచి 7 శాతానికి పెంచాలనే లక్ష్యంతో చంద్రబాబు ఇప్పుడు పనిచేస్తున్నారు. కార్యకర్తల బలం ఉండటంతో అది పెద్ద కష్టమేమీ కాదని పార్టీ భావిస్తోంది.

పోటీకి తొలగిని అడ్డంకులు
టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారడంతో సమైక్యవాద పార్టీలకు తెలంగాణలో పోటీచేయడానికి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని భావిస్తున్నారు. మొన్నటివరకు సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచేదని, ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చడంద్వారా ఆ పార్టీయే అందరికీ అడ్డంకులు తొలిగించి వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు గ్రేటర్ హైదరాబాద్ లో గట్టిగా పట్టున్న తెలుగుదేశం ముందుగా ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. దానితర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ఒక సభ నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఈ రెండు ప్రాంతాల్లోనే పట్టు నిరూపించుకోవాలనుకుంటోంది.

ఓటుబ్యాంకును బీజేపీ వదులుకోదు?
5 నుంచి 7 శాతం వరకు ఓటుబ్యాంకు పెరిగితే అంతటి ఓటుబ్యాంకు శాతాన్ని బీజేపీ వదులుకోదు. తెలంగాణలో మద్దతు అడుగుతుంది. అప్పుడు ఇక్కడ అవసరమైన మద్దతు బీజేపీకి ఇస్తూనే ఏపీలో తెరవెనక వైఎస్ జగన్ కు అందుతున్న మద్దతును నిలిపివేసేలా అడుగులు వేస్తోంది. తనకు ఎటువంటి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదుకానీ వైసీపీకి మాత్రం సహకారం అందించకూడదు అనేదే చంద్రబాబు ప్రధాన భావనగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న చంద్రబాబు ఆ దిశగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications