జూ ఎన్టీఆర్ను ముంచారు, పవన్ వంతు: బాబుపై గట్టు
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతు లేని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అర్రులు చాస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గట్టు రామచంద్ర రావు ఆదివారం అన్నారు. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టిడిపి తరఫున ప్రచారం చేశారని, ఆయనను ముంచాడని బాబుపై ధ్వజమెత్తారు. ఇప్పుడు పవన్తో పొత్తు కోసం వెంపర్లాండుతున్నారని, ఆయనను ముంచుతారని అభిప్రాయపడ్డారు.
అదే 2009 సమయంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ పైన టిడిపి అప్పుడు నిప్పులు చెరిగిందని, ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు కోసం అర్రులు చాస్తోందన్నారు. అప్పుడు తిట్టి.. ఇప్పుడు పొత్తు కోసం ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు.

మరోవైపు, టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాగర్జన, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, సోదరి షర్మిల జనభేరితో సీమాంధ్ర ఎన్నికల ప్రచారం తారస్ధాయికి చేరుకుంది. అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుని చంద్రబాబు, సంక్షేమం తాయిలాలను ఎరవేసే విధంగా జగన్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రచారం మాత్రం విభజన పాపం మాదికాదు అంటూ ఆత్మరక్షణ యాత్రగా ముగిసింది.
టిడిపి తరఫున చంద్రబాబు అన్నీ తానై ప్రచార బాధ్యతలు స్వీకరించి ముందుకెళుతుండగా, జగన్కు, సోదరి షర్మిల, తల్లి విజయమ్మ అండదండలతో జనంలోకి చొచ్చుకెళుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు గడువు మరో 40 రోజులు ఉన్నా, అప్పుడే యుద్ధవాతావరణం నెలకొంది. ప్రజాగర్జన, జనభేరి మధ్య సందడి, ఆర్భాటం లేకుండా ఆంధ్ర, రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ముగిసింది. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కర్నూలులో ముగిసింది.












Click it and Unblock the Notifications