ఆధిపత్య పోరులో పరిటాల, వరదాపురం సూరి?
పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ధర్మవరం బాధ్యతలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు సూచించడంతో ఇష్టం లేకపోయినప్పటికీ అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మూడు సంవత్సరాలు గడిచేసరికి నియోజకవర్గంలో పట్టు పెంచుకున్న శ్రీరామ్ ఈసారి ఎన్నికలకు ఇక్కడినుంచే పోటీచేయడానికి సమాయత్తమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ తల్లి సునీత పోటీచేయనున్నారు.
ధర్మవరం నుంచే పోటీచేస్తున్నా: శ్రీరామ్
తెలుగుదేశం పార్టీకి చెందిన వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ 2014లో ధర్మవరం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో ఓటమిపాలయ్యారు. తనకున్న వ్యక్తిగత సమస్యల దృష్ట్యా ఆయన భారతీయ జనతాపార్టీలో చేరడంతో అప్పటినుంచే నియోజకవర్గ బాధ్యతలను శ్రీరామ్ చూస్తున్నారు. వరదాపురం సూరి ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీలో చేరతారని భావిస్తున్న శ్రీరామ్ ధర్మవరం నుంచి తానే పోటీచేస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలందరికీ విషయాన్ని తెలియజేశారు.
వరదాపురంపై పరిటాల వర్గం మాటల యుద్ధం!!
వరదాపురం సూరి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. దీనిపై పరిటాల శ్రీరామ్ వర్గం నేరుగా సూరిపై మాటల యుద్ధానికి దిగింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలను తరుచుగా బయటపెడుతూ ఆయన్ను పార్టీలోకి తీసుకోవద్దని పరిటాల శ్రీరామ్ అధిష్టానాన్ని కోరుతున్నారు.
ఈ విభేదాలే సిట్టింగ్ ఎమ్మెల్యేకు కలిసివస్తున్నాయి
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినవారిని గుర్తుపెట్టుకుంటుందని, వారికే టికెట్లు ఇస్తుందని చంద్రబాబు ప్రకటించడంతో ధర్మవరం నుంచి తనకు టికెట్ కచ్చితంగా వస్తుందనే నమ్మకంతో శ్రీరామ్ ఉన్నారు. చివరి క్షణంలోనైనా సూరి పార్టీలోచేరి టికెట్ ఎగరేసుకుపోతారనే అనుమానంతోపాటు పొత్తులు కుదిరితే అటువైపు నుంచైనా సీటు చేజిక్కించుకోవాలని వరదాపురం సూరి చూస్తున్నారంటున్నారు శ్రీరామ్.
అందుకే నేరుగా సూరిపైనే విమర్శల బాణాలను శ్రీరామ్ వదులుతున్నారు. వీరిద్దరి మధ్య వివాదం ఇలా కొనసాగుతుండటంతో రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డికి విజయావకాశాలు మెరుగుపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.