లోకేష్ నుంచి చంద్రబాబు కోరుకుంటుంది ఇదే
పాదయాత్ర వ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని మారుస్తుంది. రాజకీయంగా రాటుతేలేలా చేస్తుంది.
ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. యాత్రలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టిసారిస్తారు. 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు సాగే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది.
అప్పటివరకు చూడని 'కొత్త ప్రపంచం'
గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల, చంద్రబాబు పాదయాత్రలు చేశారు. యాత్రలు చేసిన తర్వాత వైఎస్, చంద్రబాబు, జగన్ ముఖ్యమంత్రులయ్యారు. రాజకీయ వర్గాల్లో పాదయాత్ర అంటే అంత సెంటిమెంట్ గా నిలిచిపోయింది. ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవడానికి ఈ యాత్ర ద్వారా అవకాశం కలుగుతుంది.
పాదయాత్ర చేసేవారికి అప్పటివరకు చూడని 'కొత్త ప్రపంచం' కనపడుతుంది. అంతేకాదు.. కొత్త సమస్యలను గుర్తించడంతోపాటు ప్రజల మనస్తత్వం అర్థమవుతుంది. తాను ఏం చేయాలి? అనేదానిపై ఒక స్పష్టత వస్తుంది. తనను తాను తీర్చిదిద్దుకోవడంతోపాటు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తాము ఎటువంటి పరిపాలన అందించాలి అనే విషయాలపై స్పష్టత వస్తుంది.
వ్యక్తి నడవడికలో మార్పు
అదే క్రమంలో పాదయాత్ర చేసే వ్యక్తి నడవడిక కూడా మారుతుంది. మాటతీరులో తేడా వస్తుంది. పార్టీలోని ఇతర నాయకులతో వ్యవహరించే విధానం కూడా మారుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పాదయాత్ర అనేది వ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని తీర్చిదిద్దుతుంది.
వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చేసినప్పుడు కూడా జరిగింది ఇదే. యాత్రలు ప్రారంభించకముందు వారి రాజకీయం, వారి వ్యవహారశైలి వేరు. యాత్ర చేసిన తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది.
రాజకీయంగా రాటుతేలతారు..
కష్టమైనా, నష్టమైనా పాదయాత్ర చేయడంద్వారా రాజకీయంగా రాటుతేలతాడని చంద్రబాబు భావించే లోకేష్ పాదయాత్రకు పచ్చజెండా ఊపారు. అంతేకాకుండా దాదాపు 125 నియోజకవర్గాలను కవర్ చేయడంద్వారా రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏ నియోజకవర్గంలో ఏ పరిస్థితి నెలకొంది? అక్కడి ప్రధాన సమస్యలేంటి? తెలుగుదేశం పార్టీ విజయానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే విషయాల్లో స్పష్టత వస్తుంది.
పవన్ కల్యాణ్ కూడా మరోవైపు 'వారాహి' ద్వారా బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. అధికారికంగా ఎప్పుడు? అనేది ప్రకటించలేదు. లోకేష్ పాదయాత్ర దాదాపు ఎన్నికల వేళ ముగుస్తుంది. తెలుగుదేశం , జనసేన అధికారలోకి రావడంద్వారా లోకేష్ పాదయాత్ర దోహదపడిందని చెప్పుకోవడానికి టీడీపీ శ్రేణులకు ఒక అవకాశం దొరుకుతుంది.