సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్య: ముగ్గురి అరెస్టు
విశాఖపట్నం: సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్యకేసును తూర్పు గోదావరి జిల్లా పోలీసులు చేధించి ముగ్గురు ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. గత నెల 25న విశాఖ జిల్లా అడ్డరోడ్డు పి.తిమ్మాపురం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ పసలపూడి ఆంజనేయులును గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసిన విషయం తెలిసిందే.
తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తమ సిబ్బందితో పాటు బృందాలుగా విడిపో య రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నేరస్తులు వాడిన కారు నకిలీ నెంబర్ ఆధారంగా దక్షిణ ఢిల్లీకి చెందిన సిజోచంద్రన్, మధ్యప్రదేశ్కు చెందిన సునీల్ గయేంద్రగవాడే, మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బంటి అభిజిత్ గంగాధర్ మశ్రమ్లు పోలీసులకు దొరికారని శుక్రవారం ఎస్పీ రవిప్రకాష్ విలేకరులకు తెలిపారు.
గంజాయి స్వాధీనం
ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లాలోని రోలుగుంట మండలం పెదపేట దగ్గర రూ.70 లక్షల విలువ చేసే గంజాయిని నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు.
విశాఖ ఏజెన్సీ నుంచి కోట్లాది రూపాయల విలువగల గంజాయి తరలిపోతుంది. ఎక్సైజ్ పోలీసులు దాడులు చేస్తున్నా గంజాయి సాగు, అక్రమ రవాణాకు తెరపడటం లేదు. గిరిజనులకు డబ్బు ప్రలోభపెట్టి గంజాయిని సాగు చేయిస్తున్నారని భావిస్తున్నారు.