సుప్రీంకోర్టు ఎఫెక్ట్: తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆ నిర్ణయం?
Tirumala Laddu row: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదంపై విచారణకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా, స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనెను కల్తీ చేసినట్లు వస్తోన్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ.. ఈ నెల 3వ తేదీ వరకు ఉండకపోవచ్చని సమాచారం.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

దీనిపై సిట్ను ఏర్పాటైంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి సారథ్యంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకట్ రావు, డిప్యూటీ ఎస్పీలు జీ సీతారామ రావు, జే శివనారాయణ స్వామి, అన్నమయ్య రాయచోటి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టీ సత్యనారాయణ, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కే ఉమా మహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఎం సూర్యనారాయణలతో కూడిన టీమ్ ఇది.
ప్రధానంగా- తమిళనాడులోని దిండిగల్లో గల ఏఆర్ డెయిరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ తన దర్యాప్తు మొదలు పెట్టింది. మూడో రోజు విచారణలో భాగంగా తిరుమలలో గల టీటీడీకి చెందిన ఫ్లోర్ మిల్, ల్యాబొరేటరీ, మార్కెటింగ్ కార్యాలయం, శ్రీవారి పోటును అధికారులు తనిఖీ చేశారు. నెయ్యి నమూనాలను సేకరించారు.
దీనితో తొలి విడత సిట్ విచారణ ముగిసినట్టయింది. నాలుగు రోజులు పాటు విచారణ కొనసాగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ ద్వారకా తిరుమల రావుకు వివరించారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపినాథ్ జెట్టి. అనంతరం తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్నారు.

ఈ నెల 3వ తేదీ వరకు తిరుపతిలో గల పోలీస్ గెస్ట్హౌస్కు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. అప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టకపోవచ్చని చెబుతున్నారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లుగా అనుమానించిన ఏఆర్ డెయిరీ సహా ఇతర ప్రాంతాల్లో దర్యాప్తునకు సైతం తాత్కాలిక బ్రేక్ వేసినట్లు సమాచారం.
గురువారం మళ్లీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆ తరువాత వెలువడే ఉత్తర్వుల మేరకు సిట్ నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. ఇదే విషయాన్ని ద్వారకా తిరుమల రావు కూడా ధృవీకరించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేపు విచారణ దశలో ఉండటం వల్ల 3వ తేదీ వరకు దర్యాప్తు నిలిపివేయాలని నిర్ణయించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications