గుడ్డలూడతీసి...కాళ్లతో తన్నాడు...గిరిజన విద్యార్థులపై ఓ ప్రిన్సిపాల్ దాష్టికం
నెల్లూరు:విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పాల్సిన ఆధ్యాపకుడే తానే సంస్కారం మరచి నీచంగా ప్రవర్తించిన ఉదంతం నెల్లూరు జిల్లా దుర్గామిట్టలో ఈ చోటుచేసుకుంది.
గిరిజన బాలుర గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న ఈ ఉపాధ్యాయుడు తన రెసిడెన్షియల్ స్కూల్ లోని ఎస్టీ విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొట్టడమే కాదు...వారిచేత ఇంటివద్ద సొంత పనులు చేయించుకుంటున్నాడు. అయితే ఎట్టకేలకు ఈ అయ్యగారి వ్యవహారం వెలుగు చూడటం, అధికారులకు ఫిర్యాదులు అందడంతో గత్యంతరం లేక కాళ్లబేరానికి దిగాడు.
ఈయన పేరు వెంకటరమణ...ఈయన దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలోని గిరిజన ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు. ఈయనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది సమాఖ్య నాయకులు సోమవారం కలెక్టర్స్, ఎస్పీ గ్రీవెన్స్లలో ఫిర్యాదు చేశారు. ఈ గురువు గారు గిరిజన విద్యార్థులను బట్టలు ఊడదీసి కొట్టడం, తలను గోడకు వేసి కొట్టడం, విద్యార్థులను కాళ్లతో తన్నడం ఇలా వివిధ రకాల పద్దతుల్లో శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని వారు ఫిర్యాదులో వివరించారు.
అంతేకాకుండా ఈ ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి బూతులు తిట్టడం, హాస్టల్లో పిల్లల చేత సొంత పనులు చేయించుకోవడం చేస్తున్నాడని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు అనంతరం ప్రిన్సిపాల్ వెంకట రమణ విద్యార్థులను హింసిస్తున్న ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లు, ఫోటోలను వారు మీడియాకు అందచేశారు. తమ యానాది జాతి పిల్లలు విద్యకు దూరమవుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు ఉండటం వల్ల వారు మరింత భీతిల్లి పిల్లలు స్కూళ్లకు రావడం మానేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఒక మీడియా సంస్థ ప్రిన్సిపాల్ పై గ్రీవెన్స్లో అందిన ఫిర్యాదు గురించి ఆయనను వివరణ అడిగే ప్రయత్నం చేయగా ప్రిన్సిపాల్ ,వార్డెన్ అందుబాటులో లేరని వారు వచ్చాక మాట్లాడవలసిందిగా గురుకుల పాఠశాల సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ప్రిన్సిపాల్ ను విలేకరి ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయగా సిబ్బంది ప్రిన్సిపాల్ కు కాకుండా వార్డెన్కు లైన్ కలిపారు.
ఆ వార్డెన్ ఈ విషయమై ఫోన్ లో మాట్లాడుతూ " సార్ అది ఎప్పుడో జరిగింది...ఇప్పుడు వాటి గురించి ఎందుకు?...మీకు ఏం కావాలో చెప్పండి...విషయం బయటకు రానివ్వకుండా చూడండి" అని బేరాలకు దిగాడు. ప్రిన్సిపాల్ తో మాట్లాడాల్సిందేననడంతో తరువాత లైన్ లోకి వచ్చిన ప్రిన్సిపాల్ తాను విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకే వారిపై చేయి చేసుకున్నానని...అంతే తప్ప పిల్లలను హింసించలేదని చెబుతున్నారు.