రైతాంగాన్ని ఆదుకోవాలి: గవర్నర్కు టిఆర్ఎస్ వినతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ను కలిశారు. వారం రోజులుగా కురిసిన వడగళ్ల కారణంగా తెలంగాణ ప్రాంతంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని గవర్నర్ను కోరినట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. గవర్నర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం కారణంగా నోటికందిన పంట ధ్వంసమైందని తెలిపారు.
అకాల వర్షాలు, వడగళ్ల వానతో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాలోని రైతులు తమ పంటలను పూర్తి కోల్పోయారని, పంటల నష్టంపై గవర్నర్కు సవివరంగా చెప్పినట్లు ఈటెల రాజేందర్ చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాంలో తుపాను వస్తే సీమాంధ్ర ప్రాంత రైతులకు నష్ట పరిహారం చెల్లించి, తెలంగాణ ప్రాంత రైతులను విస్మరించారని ఆరోపించారు.

రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడైనా తమ పాంత్ర రైతులను ఆదుకోవాలని గవర్నర్ ను కోరినట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని రైతులు రబీ కాలంలో వేసిన వరి, చెరకు, మక్కలు, పసుపు, జొన్న పంటలు పూర్తిగా నష్టపోయారని మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ అన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానతో పంటలు పూర్తిగా నష్టపోగా, పశువులు కూడా మృతి చెందాయని చెప్పారు.
తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని గవర్నర్ను కోరినట్లు పోచారం శ్రీనివాస్ తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో తుపాను కారణంగా రాష్ట్రంలోని రైతాంగం నష్టపోయారని, అయితే సీమాంధ్ర ప్రాంత రైతులకు నష్ట పరిహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలోని రైతులకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం వడగళ్ల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ ప్రాంత రైతులను ఆదుకోవాలని, ఎకరానికి రూ. 20వేలు పరిహారంగా అందించాలని కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications