ఇదే ఛాన్స్: జెపి, అలా ఎలా అంటారని తెరాస నిలదీత
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లులోని లోపాలను బయట పెట్టేందుకు ఇదే మంచి అవకాశమని లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ బుధవారం అన్నారు. బిల్లు పైన చర్చ ప్రారంభమైన అనంతరం గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం జెపి మీడియా పాయింటు వద్ద మాట్లాడారు.
గురువారం నుండి చర్చ ప్రశాంత, సామరస్య వాతావరణంలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో వాక్స్వాతంత్రం అందరికీ ఉన్నా కొందరు మంచికి, మరికొందరు చెడుకు ఉపయోగించుకుంటారన్నారు. అవినీతిని అంతం చేసేందుకు అందరు ముందుకు రావాలని కోరారు. బిల్లులోని లోపాలు చెప్పేందుకు చర్చ ద్వారా మంచి అవకాశం వచ్చిందన్న జెపి, చర్చను ప్రారంభింప చేసినందుకు స్పీకర్కు అభినందనలు తెలిపారు.

జెపి నిలదీత
తెలంగాణ రాష్ట్రం రావడం తెలంగాణ రాష్ట్ర సమితికి ఇష్టం లేదని జెపి మంగళవారం చేసిన వ్యాఖ్యల పైన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ రోజు ఆయనను అసెంబ్లీ ప్రాంగణంలో నిలదీశారు. తమకు తెలంగాణ రావడం ఇష్టం లేదని ఎలా అంటారన్నారు. దానికి జెపి స్పందిస్తూ.. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు మీడియా పాయింటు వద్ద వైయస్సార్ కాంగ్రెసు, తెరాస ప్రజాప్రతినిధులు పోటా పోటీగా నినాదాలు చేశారు.
ఆనందంగా ఉంది: ఈటెల
బిల్లుపై చర్చను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. మంత్రి వట్టి వసంత్ కుమార్కు బిల్లును వ్యతిరేకించే హక్కు లేదన్నారు. ఆయన కాంగ్రెసు పార్టీకి, పదవికి రాజీనామా చేసి వ్యతిరేకించాలన్నారు. పదవిలో కొనసాగుతూ వ్యతిరేకించవద్దన్నారు.
హామీతో తగ్గిన టిడిపి
చర్చకు ససేమీరా అన్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం పూర్తి సమాచారం ఇస్తామని హామీ ఇవ్వడంతో చర్చకు సహకరిస్తోంది. దీనిపై కోడెల శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాండుకు తలొగ్గి, రెండు రోజుల్లో సమాచారం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అన్ని అంశాల పైన చర్చ జరగాలన్నారు. సభలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల కుట్రలను బయటపెడతామన్నారు. హంగామా సృష్టించేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హంగామా అన్నారు.












Click it and Unblock the Notifications