తిరుమలలో ఆర్జిత సేవలపై టీటీడీ తాజా సమాచారం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు బారులు తీరుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
ఈ క్రమంలో బుధవారం నాడు 71,417 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,396 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.42 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఏప్రిల్ నెలలో ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ సేవలకు సంబంధించిన కోటా టికెట్ల విడుదల వివరాలను టీటీడీ అధికారులు కొద్దిసేపటి కిందటే వెల్లడించారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18వ తేదీన ఉదయం 10 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
రెండు రోజుల పాటు అంటే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవి తెరిచి ఉంటాయి. ఈ లోగా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
శ్రీవారి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా బుకింగ్ ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే- వర్చువల్ విధానంలో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణలో పాల్గొనదలిచిన వారి కోసం 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది.
అంగప్రదక్షిణం టోకెన్లు 23వ తేదీన ఉదయం 10 గంటల నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లు / వికలాంగుల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి బుక్ చేసుకోవచ్చు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఏప్రిల్ నెల కోటాను 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. తిరుమల తిరుపతిల్లో వసతి కోటా కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.
తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications