తిరుమల శ్రీవారి పవిత్రాల తయారీ వెనుక..ఆసక్తికర కథనం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 72,951 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,143 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.71 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 27 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు పంపిణీ చేశారు.

తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామివారికి, వకుళమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనులవారికి, యోగనరసింహస్వామి వారికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.
సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మళ్లీ రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు అర్చకులు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో జే శ్యామలరావు, ఆదనపు ఈవో సీ హెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
- పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
- చారిత్రక ఆధారాల ప్రకారం స్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కల, అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.
- పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.












Click it and Unblock the Notifications