తుని ఘటన: తుళ్లూరు 'వాళ్లే'నని బాబుపై అంబటి నిప్పులు, కావూరి-సుజనలపైనా
విజయవాడ: కాపు గర్జన, తుని విధ్వంసంపై వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది తుళ్లూరులో టిడిపి ముఠాలు పంటలను కాల్చేశాయని, వారే ఇప్పుడు తుని ఘటనకు కారణం కావొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి నేతలు జగన్ పైన కావాలనే బురద జల్లుతున్నారని ఆరోపించారు. తుని ఘటన పైన చంద్రబాబు, టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబుతో తమకు ఎలాంటి శతృత్వం లేదన్నారు. టిడిపి నేతలు కాపు ఉద్యమాన్ని నీరుగార్చవద్దన్నారు.
చంద్రబాబు బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీసీ కమిషన్ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదని, బీసీ కమిషన్ విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదన్నారు. బీసీ కమిషన్ విషయమై సీఎం చంద్రబాబు నేరుగా దొరికిపోయారన్నారు. చంద్రబాబుకు మద్దతిచ్చి టిడిపి కాపు నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోవద్దన్నారు.
టిడిపిలోని గంటా శ్రీనివాస రావు, తోట త్రిమూర్తులు తదితరులు కాపుల కోటాలో ఎమ్మెల్యేలు, మంత్రులు కావొచ్చునని కానీ, కాపుల ఉద్యమాన్ని నీరుగార్చి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కాపులను బీసీలలో చేర్చవద్దని డిమాండ్ చేస్తున్నారన్నారు.
అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేర్చుతానని ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు చర్చలు అంటూ చెప్పడం ఏమిటన్నారు. టిడిపి చెప్పిన మేనిఫెస్టోను గౌరవించాల్సిన నైతిక బాధ్యత ఆ పార్టీ పైన ఉందన్నారు.
కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు గాజులు కొనిస్తానన్నాడట, ఉట్టికెగరలేని వాడు నింగికి ఎగురుతానన్నాడట.. ఇలా ఉంది చంద్రబాబు తీరు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయవద్దన్నారు.
ముద్రగడ పద్మనాభం కాపు అంశాన్ని లేవనెత్తక ముందే చంద్రబాబు జీవో అంశాన్ని లేవనెత్తితే బాగుండేదని, ఇప్పుడు లేవనెత్తడం సరికాదన్నారు. తుని ఘటనకు పులివెందుల నుంచి వచ్చారని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. ఆ ఘటనకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పడం ఏమిటన్నారు.
విశాఖలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు జరిగిందని, అక్కడి నుంచి రానున్న నాలుగు లక్షల రూపాయల పెట్టుబడులు ఆగిపోతాయని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు కాకమ్మ కథలు చెప్పవద్దన్నారు. టిడిపి ఎంపీ సుజనా చౌదరి బ్యాంకుకు ఎంత ఎగ్గొట్టారో చెప్పాలన్నారు.
టిడిపి మిత్ర పక్షం బిజెపి నేత కావూరి సాంబశివ రావు బ్యాంకుకు ఎంత ఎగ్గొట్టారన్నారు. వారిని మీరు కాపాడుతారా అని నిలదీశారు. ఇలాంటి పారిశ్రామికవేత్తలను కాపాడుతూ... జగన్ వల్ల ఇండస్ట్రియలిస్టులు రావడం లేదని చెప్పడం సరికాదన్నారు.
గత ఏడాది తుళ్లూరు ప్రాంతంలో పంటలకు నిప్పు పెట్టింది టిడిపి వాళ్లేనని ఆరోపించారు. జగన్కు పేరుప్రతిష్టలు పెరుగుతున్నాయని చంద్రబాబు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తుళ్లూరులో టిడిపి ముఠా పంటలకు నిప్పు పెట్టిందని, ఇప్పుడు తుని ఘటనకు వారే బాధ్యులను అంబటి అనుమానం వ్యక్తం చేశారు.
గోదావరి జిల్లాల కాపులు శాంతిపరులు అని చెప్పిన చంద్రబాబు... వారి పైనే కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల ఘటన పైన ఓ రకంగా, ఇప్పుడు మరో రకంగా చంద్రబాబు అనుకూల పత్రికలు రాస్తున్నాయన్నారు.
మీలాంటి ముఖ్యమంత్రులను ఈ రాష్ట్రం ఎంతోమందిని చూసిందన్నారు. ఇలాంటి నికృష్ట పాలన కలకాలం కొనసాగదన్నారు. మీరు బెదిరిస్తే బెదిరేది ఉండదన్నారు. జైళ్లకు పంపిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు.
ఉద్యమకారులను జైలులో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తే.. కాచుకోవాలన్నారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు. పోలీసు కేసులతో బెదిరిస్తే భయపడమని చెప్పారు. 13 జిల్లాల్లోని కాపుల పైన కేసులు పెడుతూ.. మరోవైపు కాపులు శాంతిపరులు అని చెప్పడం ద్వంద్వ వైఖరి కాదా అన్నారు.
మీరు ఇచ్చిన హామీ మేరకు కాపులను వెంటనే బీసీలలో చేర్చాలన్నారు. బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. బీసీలకు అన్యాయం చేయకుండా కాపులలో బీసీలలో చేర్చాలన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలకు టిడిపి కాపు నేతలు దాసోహం కావొద్దన్నారు.
చంద్రబాబుకు మద్దతు ఇచ్చి... మీరు పుట్టిన కాపు కులానికి అన్యాయం చేయవద్దని మంత్రి గంటా శ్రీనివాస రావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్పలకు హితవు పలికారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తాము భావిస్తున్నామన్నారు. ముద్రగడ లేఖ రాసినప్పుడు చర్చిస్తే బాగుండేదన్నారు.